కొండా ఫ్యామిలీపై రేవంత్ రెడ్డి సీరియస్.. చర్యలు తప్పవని హెచ్చరిక!

Revanth Reddy serious on Konda family warns of action
  • క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణించిన కాంగ్రెస్ అధిష్ఠానం
  • కఠిన చర్యలు తప్పవని పార్టీ ముఖ్య నేతలకు స్పష్టం చేసిన సీఎం
  • మంత్రి సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన పీసీసీ
  • సీఎంపై విమర్శలు చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని గట్టి సంకేతాలు
మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని ఏమాత్రం సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ పర్యటన నుంచే ముఖ్య నేతలకు ఆయన గట్టి హెచ్చరికలు పంపినట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం కూడా అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మూడు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పరకాలలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తద్వారా రేవూరి అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేస్తూ స్పష్టమైన సంకేతాలిచ్చారు. అయితే, ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేసేలా.. ఆ మరుసటి రోజే మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ పరకాల నియోజకవర్గంలో సభ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా, వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.

సీఎం పర్యటనకు స్థానిక మంత్రిగా ఉన్న కొండా సురేఖ గైర్హాజరు కావడం, ఆ వెంటనే ఆమె కుమార్తె ఈ వ్యాఖ్యలు చేయడం ఒక ప్రణాళిక ప్రకారమే జరిగిందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ పరిణామాలపై బుధవారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్.. అక్కడే కొందరు ముఖ్య నేతల వద్ద తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మరికొందరు సీనియర్ మంత్రులతో ఫోన్‌లో మాట్లాడి, ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నట్లు చెప్పారని సమాచారం.

సీఎం ఆదేశాల మేరకు పీసీసీ క్రమశిక్షణా కమిటీ వెంటనే రంగంలోకి దిగింది. మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కుమార్తె చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కోరింది. అయితే, "కుమార్తె చేసిన వ్యాఖ్యలకు నేనెలా బాధ్యురాలిని అవుతాను?" అని మంత్రి సురేఖ గురువారం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

ఈ విషయంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్ స్పందిస్తూ.. "సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎవరికి వారు పోటీ చేస్తామని ప్రకటించుకోవడం సరికాదు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు. మంత్రి సురేఖ వివరణను పరిశీలించాక తదుపరి చర్యలపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది" అని స్పష్టం చేశారు.  
Advertisement
Revanth Reddy
Konda Surekha
Susmita Patel
Parkal constituency
Congress party discipline
Telangana politics

More Telugu News