సూర్య నమ్మకాన్ని నిలబెట్టాను: దర్శకుడు వెంకీ అట్లూరి

Venky Atluri says I kept Suriya trust with Vishwanath and Sons success
  • నాలుగు రోజుల్లో రూ.150 కోట్లు సాధించిన 'విశ్వనాథ్ & సన్స్'
  • సూర్య నమ్మకాన్ని నిలబెట్టానన్న దర్శకుడు వెంకీ అట్లూరి
  • నిజాయితీ కథకు కమర్షియల్ హంగులు వద్దన్నది సూర్యనే అని వెల్లడి
  • త్రివిక్రమ్‌తో పోల్చడం గౌరవంగా భావిస్తున్నానన్న దర్శకుడు
  • మంచి ఫ్యామిలీ సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని వ్యాఖ్య
తమిళ అగ్ర నటుడు సూర్య, యువ దర్శకుడు వెంకీ అట్లూరి కలయికలో వచ్చిన 'విశ్వనాథ్ & సన్స్' చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ కుటుంబ కథా చిత్రం, కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి మీడియాతో ముచ్చటించి సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేయడంతో పాటు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. "ఈ కథ వినగానే సూర్య గారు ఎంతో ఇష్టపడ్డారు. ఆయన కొంతకాలంగా ఒక మంచి కుటుంబ కథ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, కథకు అనవసరమైన కమర్షియల్ హంగులు జోడించకుండా నిజాయతీగా తీద్దామని ఆయనే చెప్పారు. సినిమా చూశాక, తాను ఏదైతే నమ్మారో అదే తెరపై కనిపించడంతో ఆయన చాలా సంతోషపడ్డారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టగలిగాననే సంతృప్తి నాకుంది" అని తెలిపారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో తనను పోల్చడంపై స్పందిస్తూ.. "నేను సినీ పరిశ్రమలోకి రావడానికి మణిరత్నం గారు, త్రివిక్రమ్ గారే స్ఫూర్తి. అలాంటిది త్రివిక్రమ్ గారితో నన్ను పోల్చడం గౌరవంగా భావిస్తున్నాను. ఆయన సినిమా చూసి చాలా బాగుందని, ఎలాంటి మార్పులు సూచించకపోవడం నాకు పెద్ద ప్రశంస. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మరింత బాధ్యతగా పనిచేస్తాను" అని వివరించారు.

సినిమా కథ పుట్టుక గురించి చెబుతూ.. "వయసు వ్యత్యాసం ఉన్న బంధం నేపథ్యంలో ఈ కథను 2022లోనే రాసుకున్నాను. అప్పుడు సూర్య గారిని దృష్టిలో పెట్టుకుని రాయలేదు. ఆయనకు కథ నచ్చాక, ఆయన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశాం. పరిస్థితుల వల్లే మనుషులు ఒక్కోలా ప్రవర్తిస్తారనే పాయింట్‌ను సినిమాలో చూపించాం" అని పేర్కొన్నారు.

'ప్రేమలు' ఫేమ్ మమితా బైజును ఎంపిక చేయడం, తమిళనాడులో వసూళ్లు కాస్త తక్కువగా ఉండటంపై కూడా ఆయన స్పందించారు. "కామెడీ పండించాలంటే భాషపై పట్టుండాలి. మమితకు తమిళంపై మంచి పట్టుండటంతో ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక తమిళనాడులో థియేటర్ల సంఖ్య, టికెట్ ధరలు తక్కువగా ఉండటం వల్ల వసూళ్లు తక్కువగా కనిపిస్తున్నా, లాంగ్ రన్‌లో అక్కడ కూడా భారీ విజయం సాధిస్తుంది" అని ధీమా వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా మంచి ఫ్యామిలీ సినిమాలు రాకపోవడంతో, 'విశ్వనాథ్ & సన్స్' వంటి చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని వెంకీ అట్లూరి అభిప్రాయపడ్డారు.
Advertisement
Venky Atluri
Suriya
Vishwanath and Sons
Vishwanath and Sons Box Office
Mamitha Baiju
Trivikram Srinivas

More Telugu News