ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య మృతదేహం లభ్యం

AE Nookaraju daughter Soujanya body found
  • రావులపాలెం మండలం కొమరాజులంక వద్ద గుర్తింపు
  • దవళేశ్వరం నుంచి 35 కిలోమీటర్ల మేర కొట్టుకువచ్చిన మృతదేహం
  • నూకరాజు భార్య మీనా ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు
  • నిందితుడు సాదిక్ ఖాన్ కోసం పోలీసుల ముమ్మర గాలింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో మరో విషాదం వెలుగుచూసింది. గోదావరి నదిలో గల్లంతైన ఆయన కుమార్తె సౌజన్య మృతదేహం లభ్యమైంది. రావులపాలెం మండలం కొమరాజులంక వద్ద గురువారం ఆమె మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరం కొట్టుకువచ్చి ఇక్కడ తేలింది.

కాకినాడకు చెందిన రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ వేధింపులు భరించలేక నూకరాజు తన కుటుంబంతో కలిసి ఇటీవల గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే నూకరాజు మృతదేహం లభ్యం కాగా, ఆయన మనవడు కార్తికేయ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.

ప్రస్తుతం నూకరాజు భార్య మీనా ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు, ఈ ఘటనకు ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ ఖాన్ పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
Advertisement
AE Nookaraju
Soujanya body found
Godavari river suicide
Sadiq Khan rifle coach
Kakinada suicide case

More Telugu News