సీటు రగడ.. సీఎం రేవంత్‌పై కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు

Konda Sushmita sensational comments on CM Revanth Reddy over Parkal seat
పరకాల టికెట్‌పై రేవంత్‌ను ప్రశ్నించిన కొండా సుష్మిత
రేవూరికి టికెట్‌ ఎలా ఖరారు చేస్తారని నిలదీత
టికెట్లను అధిష్ఠానమే నిర్ణయిస్తుందని స్పష్టీకరణ
కొండా మురళికి ఎమ్మెల్సీ హామీ ఎందుకు అమలు కాలేదని ప్రశ్న
బీసీల పట్ల వివక్ష చూపుతున్నారని రేవంత్‌పై ఆరోపణలు
తెలంగాణ కాంగ్రెస్‌లో పరకాల అసెంబ్లీ టికెట్‌ వ్యవహారం మరోసారి వేడెక్కింది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల పిలుపునిచ్చారు. దీనిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత తీవ్రంగా స్పందించారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.

పరకాలలో రేవూరి ప్రకాశ్‌రెడ్డికి మరోసారి టికెట్‌ ఇస్తామని రేవంత్‌రెడ్డి ఎలా చెబుతారని సుష్మిత నిలదీశారు. పరకాలలో రేవూరి ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో టికెట్లను పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని, నేతలు కాదని అన్నారు.

తన తండ్రి కొండా మురళిని రేవంత్‌రెడ్డి ఎందుకు పక్కన పెడుతున్నారని సుష్మిత ప్రశ్నించారు. కొండా మురళి సాధారణ నేత కాదని, కింగ్‌ మేకర్‌ అని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌లో తొలుత కోరింది కొండా దంపతులేనని గుర్తుచేశారు. పీసీసీ చీఫ్‌ అయిన తర్వాత రేవంత్‌రెడ్డి తమ ఇంటికి వచ్చారా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా రాకపోయినా కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని సుష్మిత పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆ హామీ ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు. సంగారెడ్డి టికెట్‌ను అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పిన సీఎం.. పరకాల విషయంలో మాత్రం తానే ఎలా నిర్ణయం చెబుతారని నిలదీశారు.

యువతకు టికెట్లు ఇవ్వాలని చెబుతూ రేవూరి ప్రకాశ్‌రెడ్డికి మరోసారి అవకాశం ఇస్తామని చెప్పడం ఏంటని ఆమె ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం పదవిని కాపాడుకోవాలంటే నిబద్ధత అవసరమని వ్యాఖ్యానించారు. బీసీల పట్ల వివక్ష చూపుతున్నారంటూ ఆరోపించారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపైనా సుష్మిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మరో ‘పొంగు’ ఉందని, ఆ పొంగు ఎక్కువ కాలం ఉండదని అన్నారు. ముఖ్యమంత్రి ఎవరో తెలియని పరిస్థితి ఉందంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి.
Advertisement
Konda Sushmita
Revanth Reddy
Parkal Assembly Ticket
Konda Murali
Telangana Congress
Revuri Prakash Reddy

More Telugu News