ఈసీ లక్షలాది ఓట్లను తొలగించింది: మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపణ

Mahesh Kumar Goud alleges Election Commission removed lakhs of votes
  • ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు తొలగించారని ఆరోపణ
  • సుమారు 73 లక్షల ఓట్లు తొలగించారన్న మహేశ్ కుమార్ గౌడ్
  • బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదని విమర్శ
  • ఈసీని కేంద్రం పాకెట్ సంస్థగా మార్చిందంటూ వ్యాఖ్య
తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం (ఈసీ) విచక్షణారహితంగా లక్షలాది ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ముసాయిదా ఓటరు జాబితా విడుదలైన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

నగరంలోని బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించలేదని, ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ వల్ల పేదలు, వలస కార్మికులే ఎక్కువగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకోవడం ఆచరణ సాధ్యం కాదని, పాత రికార్డులను సాకుగా చూపుతూ పౌరుల ఓటు హక్కును నిరాకరించడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎలాంటి పక్కా కారణాలు లేకుండా సుమారు 73 లక్షల ఓట్లను తొలగించారని, మరో 92 లక్షల ఓట్లను అనుమానిత జాబితాలో చేర్చారని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన, పోలింగ్ కేంద్రాల మార్పుల వల్ల తలెత్తిన సాంకేతిక సమస్యలు ఈ గందరగోళానికి కారణమయ్యాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీల తరహాలోనే ఎన్నికల సంఘాన్ని కూడా తన 'పాకెట్ సంస్థ'గా మార్చుకుందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
Advertisement
Mahesh Kumar Goud
TPCC
Election Commission of India
Telangana Voter List
Voter ID Deletion
Gandhi Bhavan

More Telugu News