డీఎస్సీ నియామకాల్లో డీవియేషన్ లేదు.. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి: వైసీపీకి చంద్రబాబు సవాల్

Chandrababu Naidu challenges YSRCP to debate Mega DSC recruitment in Assembly
  • మెగా డీఎస్సీ నియామకాల్లో అంతా పారదర్శకమేనన్న సీఎం చంద్రబాబు
  • అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం
  • డీఎస్సీపై వైసీపీది హిట్ అండ్ రన్ తరహా దుష్ప్రచారం అంటూ ఫైర్
  • దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ప్రతిపక్షానికి సవాల్
  • 148 రోజుల్లో 15,941 ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశామని వెల్లడి
  • అసెంబ్లీకి రాకుండా బయట పబ్జీలు ఆడుకుంటున్నారని విమర్శ
మెగా డీఎస్సీ నియామకాల్లో ఒక్క డీవియేషన్ కూడా జరగలేదని, ప్రతిభ ఆధారంగానే అత్యంత పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ అంశంపై వైసీపీ చేస్తున్నది కేవలం హిట్ అండ్ రన్ ఆరోపణలేనని, వారికి దమ్ము, ధైర్యం ఉంటే శాసనసభకు వచ్చి చర్చించాలని ఆయన సవాల్ విసిరారు. ఒడిశా కూలీలతో, 90 ఏళ్ల జగన్ జెన్ జీ వృద్ధులతో ఫేక్ ప్రదర్శనలు చేయిస్తూ డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇవాళ శాసనసభలో మెగా డీఎస్సీ నియామకాలపై జరిగిన చర్చలో సీఎం సుదీర్ఘంగా మాట్లాడారు.

విద్యాభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉంది
విద్యార్థులకు మంచి విద్య, నైపుణ్యాలు అందిస్తే వారే అత్యుత్తమ మానవ వనరులుగా తయారవుతారని తమ ప్రభుత్వం విశ్వసిస్తుందని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ హయాంలో రెసిడెన్షియల్ పాఠశాలలు, మహిళా యూనివర్సిటీ ఏర్పాటుతో విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టామని గుర్తుచేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి కిలోమీటరుకు ఓ ప్రాథమిక పాఠశాల, మండలానికి ఓ జూనియర్ కాలేజీ, జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని తెలిపారు. 

2019-24 మధ్య ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయని పాలకులు, విద్యారంగంపై డబ్బాలు కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు 14 డీఎస్సీలు జరిగితే, వాటిలో 11 డీఎస్సీలను టీడీపీ, ఎన్డీయే ప్రభుత్వాల హయాంలోనే నిర్వహించి, అవినీతికి ఆస్కారం లేకుండా నియామకాలు చేపట్టామని వివరించారు.

148 రోజుల్లోనే పారదర్శకంగా నియామకాలు
గత పాలకులు ఐదేళ్లలో చేయలేని పనిని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకంతో చేసి చూపించామని చంద్రబాబు అన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉద్యోగాలను కేవలం 148 రోజుల్లోనే పారదర్శకంగా భర్తీ చేశామని వివరించారు. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ల నుంచి హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియ వరకు అన్నీ కట్టుదిట్టంగా చేపట్టామన్నారు.

13 సబ్జెక్టులకు 42 వేల ప్రశ్నలను ఎంపిక చేసి, 154 కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో పరీక్షలు నిర్వహించి, ఫలితాలను కూడా పారదర్శకంగా విడుదల చేశామని తెలిపారు. మెరిట్ కమ్ రోస్టర్ విధానంలోనే పూర్తి ప్రతిభ ప్రకారం 15,941 మందిని ఎంపిక చేశామని, నియామక ప్రక్రియ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఉన్నాయని, ఇంతకంటే పారదర్శకత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఫిర్యాదుల పరిష్కారానికి జోనల్, రాష్ట్రస్థాయి కమిటీలతో పాటు అప్పీలేట్ అథారిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు.

వైసీపీవి ఫేక్ ఆందోళనలు, కుట్రలు
డీఎస్సీపై వైసీపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని సీఎం ధ్వజమెత్తారు. "గొడ్డలి పార్టీ నేతలు ఒడిశా కూలీలతో, 90 ఏళ్ల జగన్ జెన్‌జీ వ్యక్తులతో ఫేక్ ధర్నాలు చేయిస్తున్నారు. ప్రభుత్వంలో పనిచేసి రిటైరైన ఓ ఐఏఎస్ అధికారి, ఓ మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు" అని విమర్శించారు. వైసీపీ ఆరోపణలను సహించలేకే డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన టీచర్లే స్వయంగా రోడ్లపైకి వస్తున్నారని, మొన్న కర్నూలులో, నిన్న విజయవాడలో భారీగా ఆందోళనలు చేశారని గుర్తుచేశారు. "పిల్లలకు పాఠాలు చెబుతాం.. మా ప్రతిభను కించపరిస్తే గుణపాఠం కూడా చెబుతాం" అని వారు నినదించిన విషయాన్ని చంద్రబాబు సభ దృష్టికి తెచ్చారు.

అసెంబ్లీకి రాకుండా పబ్జీలా?
తమ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ అని, కుట్రలు చేసే పార్టీలకు కాదని చంద్రబాబు తేల్చిచెప్పారు. "ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి. అడ్డంగా దొరికిపోతామనే భయంతో వారు సభకు రావడం లేదు. సిగ్గులేని ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి రాకుండా బయట పబ్జీలు ఆడుకుంటున్నారు. రెండున్నరేళ్లుగా సభకు రాకుండానే జీతాలు, ప్రివిలేజెస్ తీసుకుంటున్నారు. నా జీవితంలో ఇలాంటి పార్టీని చూడలేదు" అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు ప్రజల పట్ల పూర్తి బాధ్యత ఉందని, రాష్ట్రంలో ఎలాంటి కుట్రలు పనిచేయవని, ఉపాధ్యాయ నియామకాలు అత్యంత జవాబుదారీతనంతో జరిగాయని సీఎం పునరుద్ఘాటించారు.
Advertisement
Chandrababu Naidu
Mega DSC Recruitment
Andhra Pradesh Assembly
YSRCP Challenge
Teacher Jobs Andhra Pradesh
Education Reforms

More Telugu News