నిజాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ ఒక్కటే సరైన మార్గం: బొత్స సత్యనారాయణ
- డీఎస్సీ అంశంపై శాసనమండలిలో వైసీపీ రచ్చ
- నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలన్న బొత్స సత్యనారాయణ
- నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని మండిపాటు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు మెగా డీఎస్సీ వివాదంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం చేపట్టిన టీచర్ నియామకాల ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష వైసీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. దీనిపై సభలో సమగ్ర చర్చ జరగాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలు, స్పోర్ట్స్ కోటా కేటాయింపుల్లో అవకతవకల్లో నిజాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ ఒక్కటే సరియైన మార్గమని ఆయన స్పష్టం చేశారు.
శాసనమండలిలో వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. కూటమి ప్రభుత్వం ‘మెగా డీఎస్సీ’ పేరుతో నిరుద్యోగులను ‘దగా డీఎస్సీ’గా మోసం చేసిందని విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. పరీక్షలు రాయని వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయని, ఉద్యోగాల బేరసారాలకు సంబంధించిన ఆడియో టేపులు బయటకు వచ్చినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక మర్మమేంటని బొత్స ప్రశ్నించారు. ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం చర్చ నుంచి పారిపోతోందని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 నియామకాలపై అధికార పక్షం చేస్తున్న ఆరోపణలనూ ప్రస్తావించారు. నిజంగా గ్రూప్-1లో అక్రమాలు జరిగాయని భావిస్తే, దానితో పాటు ప్రస్తుత డీఎస్సీ ప్రక్రియపై కూడా ఒకేసారి సీబీఐ విచారణ వేయాలని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రంలో మూడేళ్ల క్రితం నుంచి ఉద్యోగార్థులు ఎదురుచూస్తున్న తరుణంలో, మెరిట్ జాబితా నిర్వహణలో పారదర్శకత లోపించిందని దుయ్యబట్టారు.