కోనసీమలో కలకలం.. ఈ నెల 3న చేపల వేటకు వెళ్లి తిరిగిరాని మత్స్యకారులు
- ఈ నెల 13 నాటికే తిరిగి రావాల్సిన మత్స్యకారులు
- ఫోన్లలో కూడా వారిని సంప్రదించేందుకు వీలుకాని వైనం
- అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగిరాకపోవడంతో కోనసీమ జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు చెందిన బోటులో ఈ నెల 3న ఎనిమిది మంది మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారని, నిర్ణీత గడువు ప్రకారం ఈ నెల 13 నాటికే తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒడ్డుకు చేరలేదని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు.
మత్స్యకారుల వద్ద 15 రోజులకు సరిపడా రేషన్ నిల్వలు, 1,000 లీటర్ల డీజిల్ మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో ఫోన్లలో కూడా వారిని సంప్రదించేందుకు వీలుకాకపోవడంతో జిల్లా యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది. బోటు విశాఖపట్నం నుంచి ఒడిశాలోని పారాదీప్ తీర ప్రాంతాల వైపు వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, పరిస్థితి తీవ్రతను గమనించిన జిల్లా కలెక్టర్ తక్షణమే ఇండియన్ కోస్ట్గార్డ్తో పాటు జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో సమన్వయం చేసుకుని సముద్రంలో విస్తృత గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బోటు యజమాని, బాధిత కుటుంబాల వివరాలను సేకరించి కోస్ట్గార్డ్కు అందించినట్లు అధికారులు తెలిపారు. తీర ప్రాంతంలో తమ వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.