ఐటీ షేర్లకు అమ్మకాల సెగ.. నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ

Sensex and Nifty end in losses as IT shares face selling pressure
  • 281 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌
  • 78 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ
  • దాదాపు 2 శాతం క్షీణించిన ఐటీ నిఫ్టీ
  • ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ షేర్లలో అమ్మకాలు
  • మెటల్‌, రియల్టీ షేర్లకు లాభాలు
దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రభావం చూపింది. దీంతో సెన్సెక్స్‌ 281.09 పాయింట్లు నష్టపోయి 77,728.16 వద్ద ముగిసింది. నిఫ్టీ 78.35 పాయింట్లు కోల్పోయి 24,287.65 వద్ద స్థిరపడింది. మార్కెట్‌లో మదుపరులు ఆచితూచి వ్యవహరించడంతో రోజంతా ఒడుదొడుకులు కనిపించాయి.

ఐటీ రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 2 శాతం పడిపోయింది. ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. మరోవైపు మెటల్‌, రియల్టీ రంగ షేర్లు రాణించాయి. 

నిఫ్టీకి 24,400 స్థాయి కీలక నిరోధంగా మారిందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ స్థాయిని అధిగమించి నిలబడితే 24,500-24,600 దిశగా సూచీ పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. దిగువన 24,300-24,200 ప్రాంతం కీలక మద్దతుగా ఉందన్నారు. 24,250 కంటే దిగువకు బలంగా పడిపోతే అమ్మకాల ఒత్తిడి పెరిగి 24,000 స్థాయికి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.

నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ 0.05 శాతం పెరిగింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ సూచీ 0.36 శాతం లాభపడింది. ఎంపిక చేసిన మెటల్‌, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్‌కు కొంత మద్దతు ఇచ్చాయి.

దేశీయంగా బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం మార్కెట్‌పై ప్రభావం చూపిందని నిపుణులు తెలిపారు. క్రూడ్‌ ధరలు పెరగడం, ఆర్‌బీఐ ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బీ) డిపాజిట్‌ విండోను ముందుగానే మూసివేయాలని నిర్ణయించడం దీనికి కారణమని చెప్పారు. అంతర్జాతీయంగా అమెరికా డాలర్‌ బలహీనపడటం, వినియోగదారుల గణాంకాలు కొంత మెరుగ్గా ఉండటం దీర్ఘకాలికంగా రిస్క్‌ తీసుకునే ఆసక్తికి మద్దతు ఇస్తున్నాయని విశ్లేషించారు.
Advertisement
Sensex
Nifty
IT Stocks
Indian Stock Market
Share Market Today
Infosys

More Telugu News