యుద్ధప్రాతిపదికన పోలవరం పనులు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Chandrababu Naidu orders Polavaram works on war footing
  • పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • 89.9 శాతం మేర పోలవరం సివిల్ పనులు పూర్తయినట్టు వెల్లడి
  • ప్రాధాన్యతా క్రమంలో 36 ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్ణయం
  • గండి పోశమ్మ ఆలయాన్ని పరిరక్షిస్తూ పనులు చేపట్టాలని ప్రత్యేక సూచన
  • రాష్ట్రంలో వర్షపాతం, భూగర్భ జలాలపైనా సమావేశంలో చర్చ
ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండ సహా రాష్ట్రంలోని ప్రాధాన్యతా ప్రాజెక్టుల పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల వారీగా జరుగుతున్న పనుల వివరాలను జలవనరుల శాఖ అధికారులు ఆయనకు నివేదించారు.

పోలవరం ప్రాజెక్టులో నిన్నటి వరకు 89.9 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎడమ కాలువ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్-1, గ్యాప్-2 పనులను శరవేగంగా చేపట్టినట్టు తెలిపారు. ఇటీవల 14 లక్షల క్యూసెక్కుల భారీ వరద ప్రవాహం వచ్చినప్పటికీ, పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా కొనసాగించామని నివేదికలో పేర్కొన్నారు.

పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, పలు కీలక సూచనలు చేశారు. డ్యామ్ సైట్ వద్ద రోడ్ల వంటి మౌలిక వసతుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా, ప్రాజెక్టు సమీపంలోని గండి పోశమ్మ ఆలయాన్ని పరిరక్షిస్తూ, స్థానికుల మనోభావాలను గౌరవించేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మొత్తం 36 ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయడంపై చర్చించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు, లోటు వర్షపాతం, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి సరఫరా, జలధార-జలహారతి కార్యక్రమాల అమలు వంటి అనేక కీలక అంశాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Polavaram Project
Andhra Pradesh Irrigation Projects
Veligonda Project
Nimmala Rama Naidu
Polavaram Civil Works Progress

More Telugu News