అబుదాబి వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్.. వీసా ఖర్చు ప్రభుత్వానిదే!

Good news for Indians traveling to Abu Dhabi government will bear visa costs
  • భారత పర్యాటకుల కోసం అబుదాబి ఉచిత యూఏఈ వీసా పథకం
  • ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్ వర్తింపు
  • ప్యాకేజీ కింద కనీసం మూడు రాత్రులు అబుదాబిలో బస చేయాల‌నే ష‌ర‌తు
  • భారత్ నుంచి రాకపోకల విమాన టిక్కెట్లు బుక్ చేసుకోవడం తప్పనిసరి
  • తొలి దశలో 20,000 మందికి ఈ ప్రయోజనం కల్పించాలని లక్ష్యం
భారత పర్యాటకులను ఆకర్షించేందుకు అబుదాబి ప్రభుత్వం ఒక ఆకర్షణీయమైన పథకాన్ని ప్రకటించింది. పరిమిత కాలానికి అర్హులైన భారత పర్యాటకులకు యూఏఈ ఎంట్రీ వీసా ఖర్చులను తామే భరించనున్నట్లు అబుదాబి సాంస్కృతిక, పర్యాటక శాఖ (డీసీటీ అబుదాబి) వెల్లడించింది. భారత మార్కెట్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ ప్రత్యేక కార్యక్రమం 2026 ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు మూడు నెలల పాటు అమల్లో ఉంటుంది. ఈ పథకం కింద తొలి దశలో సుమారు 20,000 వీసాలను ఉచితంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఈ ఉచిత వీసా సౌకర్యం పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

భారత పాస్‌పోర్ట్ కలిగి ఉండి, భారత్ నుంచి ప్రయాణించే పర్యాటకులు ఈ ఆఫర్‌కు అర్హులు. వారు ప్రభుత్వం నిర్దేశించిన ట్రావెల్ భాగస్వాములు లేదా ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా తమ ప్రయాణాన్ని బుక్ చేసుకోవాలి. ఈ ప్యాకేజీలో కనీసం వరుసగా మూడు రాత్రులు అబుదాబిలోని ఏదైనా హోటల్‌లో బస చేయడం, భారత్ నుంచి రాకపోకల విమాన టిక్కెట్లు ఉండటం తప్పనిసరి. సొంతంగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ పథకం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.

ఈ ప్రక్రియలో భాగంగా ట్రావెల్ ఏజెన్సీలు డీసీటీ నియమించిన డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ కంపెనీ ద్వారా వీసాలను ప్రాసెస్ చేస్తాయి. దీనికి అయ్యే ఖర్చును డీసీటీ నేరుగా చెల్లిస్తుంది. ఒకవేళ ఏజెన్సీలు తమ సొంత భాగస్వాముల ద్వారా వీసా పొందితే, ఒక్కో వీసాకు 285 దిర్హమ్‌లను (సుమారు రూ.7,389) డీసీటీ అబుదాబి తిరిగి చెల్లిస్తుంది. భారత్ నుంచి పర్యాటకుల సంఖ్యను పెంచడం, విమాన సర్వీసులను మెరుగుపరచడం, అబుదాబిలోని పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.
Advertisement
Abu Dhabi
Free Visa Indians
UAE Tourism
DCT Abu Dhabi
Abu Dhabi Travel
Indian Tourists

More Telugu News