యశస్వి జైస్వాల్ కెరీర్‌ను కాపాడిన ఆ ఘటన.. బయటపెట్టిన రహానే

Yashasvi Jaiswal career saved by that incident Rahane reveals
  • 2022 దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో చోటుకున్న‌ ఒక ఘటనను వెల్లడించిన రహానే
  • స్లెడ్జింగ్ ఆపకపోవడంతో జైస్వాల్‌ను మైదానం వీడమని ఆదేశించిన కెప్టెన్
  • రహానే చర్యతో 4 మ్యాచ్‌ల నిషేధ లేఖను చించేసిన మ్యాచ్ రిఫరీ
  • ఈ ఘటన జైస్వాల్ కెరీర్‌కు మేలు చేసిందన్న రహానే
  • ఆ ఫైనల్‌లో 265 పరుగులు చేసి జట్టును గెలిపించిన‌ జైస్వాల్
భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్ కెరీర్ ఆరంభంలోనే ఒక పెద్ద శిక్ష నుంచి ఎలా తప్పించుకున్నాడో సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే తాజాగా వెల్లడించాడు. 2022 దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో జైస్వాల్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధం పడకుండా తాను ఎలా అడ్డుపడ్డానో రహానే వివరించాడు.

‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రహానే ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. వెస్ట్ జోన్ కెప్టెన్‌గా ఉన్న తాను, సౌత్ జోన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. మ్యాచ్ సందర్భంగా యశస్వి జైస్వాల్, సౌత్ జోన్ బ్యాటర్ టి. రవి తేజను పదేపదే స్లెడ్జింగ్ చేశాడు. అంపైర్లు హెచ్చరించినా జైస్వాల్ తన ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన రహానే, కెప్టెన్‌గా జోక్యం చేసుకున్నాడు.

"నేను జైస్వాల్‌ను కాసేపు మైదానం విడిచి బయటకు వెళ్ల‌మని చెప్పాను. ప్రశాంతంగా ఆలోచించుకుని మళ్లీ రమ్మని సూచించాను. నా చర్యను చూసిన మ్యాచ్ రిఫరీ వి. నారాయణన్ కుట్టి, అప్పటికే సిద్ధం చేసిన నాలుగు మ్యాచ్‌ల నిషేధ లేఖను చించివేశారు" అని రహానే తెలిపాడు. ఆ సమయంలో తన నిర్ణయం జైస్వాల్‌కు బాధ కలిగించినా, అది అతని కెరీర్‌ను కాపాడిందని రహానే అభిప్రాయపడ్డాడు.

కాగా, అదే మ్యాచ్‌లో జైస్వాల్ 265 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'‌గా నిలిచాడు. వెస్ట్ జోన్ ఆ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత 2023లో జైస్వాల్ భారత జట్టులోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.
Advertisement
Yashasvi Jaiswal
Ajinkya Rahane
Duleep Trophy 2022
Cricket Sledging Incident
West Zone vs South Zone
Indian Cricket Team

More Telugu News