అమరావతి పనుల్లో అవినీతి? సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు

CPI Narayana interesting comments on Amaravati
  • అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్న నారాయణ
  • ఐకానిక్ టవర్లు, సచివాలయ నిర్మాణం జోరుగా సాగుతోందని వ్యాఖ్య
  • అవినీతి పునాదులు బలపడుతున్నాయని నారాయణ ఆందోళన
  • రాజధాని నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని డిమాండ్
  • గత పదేళ్లలో రాజధానికి తీవ్ర నష్టం జరిగిందని వ్యాఖ్య
అమరావతి రాజధాని నిర్మాణ పనులపై సీపీఐ అగ్రనేత కె. నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో పనులు వేగవంతంగా సాగుతుండటాన్ని ఆయన స్వాగతిస్తూనే, అదే స్థాయిలో అవినీతి కూడా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని నారాయణ పేర్కొన్నారు. ఎల్ అండ్ టీ సంస్థ నిర్మిస్తున్న ఐకానిక్ టవర్లు అద్భుతంగా ఉన్నాయని, ఎన్‌సీసీసీ సంస్థ సచివాలయ నిర్మాణ పనులను చురుకుగా ముందుకు తీసుకెళుతోందని ఆయన కొనియాడారు. అయితే, గడిచిన పదేళ్ల కాలంలో రాజధాని నిర్మాణానికి తీవ్ర విఘాతం కలిగిందని విమర్శించారు. తొలి ఐదేళ్లలో ప్రాధాన్యతాలను గుర్తించకపోవడం వల్ల జాప్యం జరిగిందని, ఆ తర్వాతి ఐదేళ్లలో రాజధానికి తీరని నష్టం వాటిల్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాల్లో భారీగా అవినీతి చోటుచేసుకుంటోందన్న వాదన బలంగా ఉందని, అవినీతి పునాదులు పటిష్ఠమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం ప్రాతిపదికన అవినీతి అనధికారికంగా చట్టబద్ధమవుతోందంటూ విచారం వ్యక్తం చేశారు. ఏదేమైనా రాజధాని నిర్మాణాన్ని మాత్రం యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మిగతా అంశాలను తెలివైన ప్రజలే చూసుకుంటారని, ప్రభుత్వం అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదని ఆయన సూచించారు.
Advertisement
CPI Narayana
Amaravati Capital Construction
Andhra Pradesh Politics
Amaravati Corruption Allegations
L and T Iconic Towers

More Telugu News