ఫరీదాబాద్‌లో దారుణం.. పాఠశాలలోనే టీచర్‌పై పైశాచిక దాడి.. 30 సెకన్లలో 30 కత్తిపోట్లు

Faridabad horror Brutal attack on teacher in school 30 stabs in 30 seconds
  • ఫరీదాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌ దారుణ హత్య
  • మాస్క్ ధరించి స్కూల్‌లోకి వచ్చి కత్తితో దాడి చేసిన యువకుడు
  • వేధింపులపై ఫిర్యాదు చేయడంతో పగ పెంచుకున్న నిందితుడు
  • ఘటన జరిగిన రెండు గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • నిందితుడు అమిత్ నేరం అంగీకరించినట్లు వెల్లడి
హ‌ర్యానాలోని ఫరీదాబాద్‌లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న సంధ్య (29) అనే టీచర్‌ను ఓ దుండగుడు కిరాతకంగా పొడిచి చంపాడు. పాఠశాలలోకి మాస్క్‌తో ప్రవేశించిన నిందితుడు, ఆమెను బయటకు పిలిచి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను వేధించినందుకు పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న పగతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

వివరాల్లోకి వెళితే.. ఫరీదాబాద్‌లోని సిక్రోనా గ్రామంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ విషాదం జరిగింది. పోలీసు అవుట్‌పోస్ట్‌కు అతి సమీపంలోనే ఈ పాఠశాల ఉండటం గమనార్హం. బుధవారం ఉదయం 9:30 గంటల సమయంలో మాస్క్ ధరించిన ఓ యువకుడు స్కూల్ గేటు వద్దకు వచ్చి, టీచర్ సంధ్యతో మాట్లాడాలని కోరాడు. ఆమె బయటకు రాగానే, నిందితుడు ఒక్కసారిగా కత్తితో దాడికి తెగబడ్డాడు. కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే ఆమె ముఖం, మెడ, ఛాతీపై 30కి పైగా కత్తిపోట్లు పొడిచాడు.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి పైశాచికత్వం స్పష్టంగా రికార్డయింది. లాబీలో వేచి ఉన్న నిందితుడు, టీచర్‌ను చూడగానే బయటకు రావాలని సైగ చేశాడు. ఆమె బయటకు రాగానే మెడ పట్టుకుని బయటకు లాగి, విచక్షణారహితంగా పొడవడం ప్రారంభించాడు. ఆమె కిందపడిపోయినా దాడి ఆపలేదు. అరుపులు విని బయటకు వచ్చిన స్కూల్ అడ్మినిస్ట్రేటర్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా, నిందితుడు ఆయనపైకి కూడా కత్తితో దూసుకొచ్చాడు. 

'ఎన్డీటీవీ' కథనం ప్రకారం అడ్మినిస్ట్రేటర్ మాట్లాడుతూ.. "నేను ఆఫీసులో ఉండగా బయటి నుంచి కేకలు వినిపించాయి. చూసేసరికి ఓ వ్యక్తి సంధ్యను కత్తితో పదేపదే పొడుస్తున్నాడు. నేను కేకలు వేయడంతో నా వైపు తిరిగాడు. నేను కర్ర కోసం వెనక్కి తిరిగేలోపే, అతను మళ్లీ ఆమెపై దాడి చేసి నంబర్ ప్లేట్ లేని బైక్‌పై పారిపోయాడు" అని వివరించారు.

తీవ్రంగా గాయపడిన సంధ్యను సమీపంలోని అల్ ఫలా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటన జరిగిన రెండు గంటల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని కోట్ గ్రామానికి చెందిన అమిత్ (21)గా గుర్తించారు. విచారణలో అతను నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండేళ్ల క్రితం సంధ్యతో అమిత్‌కు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆమెను వేధిస్తూ, వెంటపడేవాడు. అతని వేధింపులు భరించలేక సంధ్య కొద్ది రోజుల క్రితం అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో అతను బహిరంగంగా క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది. ఈ అవమానానికి ప్రతీకారంగానే అమిత్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Amit
Faridabad Teacher Murder
Sandhya Teacher Killing
Haryana School Stabbing
Faridabad Crime News
Stalker Revenge Murder

More Telugu News