దేశంలో విదేశీ యూనివర్సిటీలు.. 15 సంస్థలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Foreign Universities in India Center gives green signal to 15 institutions
  • భారత్‌లో 15 విదేశీ వర్సిటీల ఏర్పాటుకు అనుమతి
  • 15 సంస్థలకు 16 లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసిన యూజీసీ
  • బెంగళూరు, చెన్నై సహా పలు నగరాల్లో క్యాంపస్‌ల ఏర్పాటు
  • ఈ వర్సిటీల డిగ్రీలకు భారత డిగ్రీలతో సమాన గుర్తింపు ఉంటుందన్న మంత్రి సుకాంత మజుందార్
భారత ఉన్నత విద్యా రంగంలో ఒక కీలక ముందడుగు పడింది. దేశంలో తమ ప్రాంగణాలను (క్యాంపస్‌లను) ఏర్పాటు చేసేందుకు 15 విదేశీ విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ఆస్ట్రేలియా, ఇటలీ, అమెరికా, యూకే దేశాలకు చెందిన 15 విదేశీ విద్యా సంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇప్పటివరకు 16 ‘లెటర్స్ ఆఫ్ ఇంటెంట్’ జారీ చేసింది. ఈ విశ్వవిద్యాలయాలు బెంగళూరు, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ముంబై, చెన్నై వంటి నగరాల్లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి. యూజీసీ (విదేశీ ఉన్నత విద్యా సంస్థల నియంత్రణ) నిబంధనలు-2023కు లోబడి ఈ ప్రాంగణాలు తమ కార్యకలాపాలను సాగిస్తాయి.

ఈ విద్యా సంస్థలు బిజినెస్, ఫైనాన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బయోమెడికల్ సైన్సెస్ వంటి అత్యాధునిక కోర్సులను అందించనున్నాయి. ప్రపంచవ్యాప్త ర్యాంకింగ్స్‌లో మొదటి 500 స్థానాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలకు మాత్రమే భారత్‌లో క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు అర్హత ఉంటుందని యూజీసీ స్పష్టం చేసింది.

ఈ విదేశీ క్యాంపస్‌లు ప్రదానం చేసే డిగ్రీలను భారతీయ ఉన్నత విద్యా సంస్థల డిగ్రీలతో సమానమైనవిగా గుర్తిస్తారు. ఇందుకోసం విద్యార్థులు ఎలాంటి ప్రత్యేక ‘ఈక్వివలెన్స్ సర్టిఫికెట్’ పొందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశీ సంస్థలకు అవసరమైన సహకారం అందించడానికి, వాటి కార్యకలాపాలను పర్యవేక్షించడానికి 2025 డిసెంబరులోనే ప్రభుత్వం ఒక ఫెసిలిటేషన్ కమిటీని ఏర్పాటు చేసింది.                                
Advertisement
Foreign Universities
UGC India
Higher Education
Sukanta Majumdar
International Campuses in India
Ministry of Education

More Telugu News