ట్రంప్‌ సంతకానికి విలువే లేదన్న మాట.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ సెటైర్లు!

Mojtaba Khamenei slams Donald Trump for violating US Iran MOU
  • ఎంఓయూను అమెరికానే ఉల్లంఘించిందన్న ఇరాన్‌
  • దీంతో ట్రంప్‌ సంతకానికి విలువే లేదని తేలిందన్న సుప్రీం లీడర్‌
  • ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం ఆ దేశ వైఖరి అంటూ విమర్శలు
  • ఒత్తిడి తీసుకురావాలని యత్నిస్తే మరచిపోలేని గుణపాఠం నేర్పుతామని హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకానికి ఎలాంటి విలువ లేదని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ విమర్శించారు. ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన శాంతి అవగాహన ఒప్పందం (ఎంఓయూ)ను అమెరికానే ఉల్లంఘించిందని ఆరోపించారు. దీంతో ట్రంప్ సంతకం విలువలేనిదనే విషయం మరోసారి రుజువైందని అన్నారు.

ఇరాన్ ప్రజలకు విడుదల చేసిన సందేశంలో ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు. జూన్ 18న ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య కుదిరిన ఎంఓయూను అమెరికా పదేపదే ఉల్లంఘిస్తోందని విమర్శించారు. ఈ చర్యతో అమెరికా అసలు స్వరూపం మరోసారి బయటపడిందని, ఒప్పందాలను ఉల్లంఘించడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం ఆ దేశ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.

అమెరికా యుద్ధోన్మాదాన్ని కొనసాగిస్తూ ఇరాన్‌పై మరింత ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నిస్తే మరచిపోలేని గుణపాఠం నేర్పుతామని ఖమేనీ హెచ్చరించారు. రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌తో కలిసి తగిన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు.

ఈ ఎంఓయూ ప్రకారం 60 రోజుల్లో తుది ఒప్పందంపై ఇరు దేశాలు చర్చలు జరపాల్సి ఉంది. అయితే ఇటీవల ఇరాన్‌పై అమెరికా వరుసగా దాడులు చేయగా, ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

అమెరికా ఇప్పటికే ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘించినందున తాము కూడా ఎంఓయూ కింద ఉన్న నియమాల అమలును నిలిపివేసినట్లు ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది తెలిపారు. ప్రస్తుతం తమ ప్రాధాన్యం దేశ రక్షణేనని, చర్చల గురించి ఎలాంటి ప్రక్రియ కొనసాగడం లేదని ప్రభుత్వ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
Advertisement
Mojtaba Khamenei
Donald Trump
US Iran relations
Iran US MOU
Masoud Pezeshkian
Middle East tensions

More Telugu News