మార్స్‌లో గ్రహాంతరవాసులు కాదు.. మన బ్యాక్టీరియాలే మనకు ముప్పా?

Mars exploration risks Earth bacteria mutating into dangerous pathogens
  • అంగారక గ్రహంపైకి మనుషులను పంపే క్రమంలో కొత్త అధ్యయనం
  • వ్యోమగాములతో వెళ్లే సూక్ష్మజీవులే పెద్ద ముప్పని అంచనా
  • అంగారకుడిపై తీవ్ర అతినీలలోహిత కిరణాలు, గడ్డకట్టే ఉష్ణోగ్రతలు
  • ఆ వాతావరణంలో కొన్ని బ్యాక్టీరియాలు తమ స్వభావాన్ని మార్చుకునే ప్రమాదం
  • కొన్ని సూక్ష్మజీవులు మరింత విషపూరితంగా మారే ప్రమాదం
అంగారక గ్రహంపై మనుషులను పంపేందుకు ప్రపంచ అంతరిక్ష సంస్థలు వేగంగా సిద్ధమవుతున్న వేళ.. శాస్త్రవేత్తల కొత్త అధ్యయనం ఆసక్తికర ప్రశ్నను తెరపైకి తెచ్చింది. మార్స్‌పై ఉండే జీవుల కంటే.. భూమి నుంచి వ్యోమగాములతో వెళ్లే సూక్ష్మజీవులే భవిష్యత్‌లో పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. అక్కడి తీవ్ర వాతావరణానికి అలవాటు పడే క్రమంలో కొన్ని బ్యాక్టీరియా మరింత ప్రమాదకరంగా మారవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

మన శరీరంలో సహజంగా ఉండే కొన్ని బ్యాక్టీరియాల గురించే ఈ అధ్యయనం సాగింది. అంగారకుడిపై తీవ్ర అతినీలలోహిత కిరణాలు, గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, అత్యల్ప వాయు పీడనం, విషపూరిత పెర్‌క్లోరేట్‌ లవణాలు వంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి ఒత్తిడిలో కొన్ని బ్యాక్టీరియాలు తమ స్వభావాన్ని మార్చుకుని మరింత బలంగా మారే అవకాశం ఉందని పరిశోధన సూచిస్తోంది.

ఈ అధ్యయనాన్ని స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త టొమాసో జక్కారియా నిర్వహించారు. సాధారణ పరిస్థితుల్లో మనుషులకు ఇన్‌ఫెక్షన్లు కలిగించే నాలుగు రకాల బ్యాక్టీరియాలను ఎంపిక చేశారు. వాటిపై మార్స్‌ను పోలిన వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి పరీక్షలు నిర్వహించారు. తక్కువ గాలి పీడనం, తీవ్రమైన ఎండ, అధిక అతినీలలోహిత కిరణాలు, పెర్‌క్లోరేట్‌ లవణాలతో కూడిన పరిస్థితుల్లో వాటి ప్రవర్తనను పరిశీలించారు.

చాలా బ్యాక్టీరియా కొద్ది గంటల్లోనే నశించినా.. కొన్ని మాత్రం ఊహించిన దానికంటే ఎక్కువసేపు మనుగడ సాగించాయని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా ఎండిపోయిన పరిస్థితుల్లో కొన్ని రెండు వారాలకుపైగా జీవించాయి. ఒకవేళ ఇవి వ్యోమగాముల నివాస కేంద్రాల్లోకి చేరితే అక్కడ ఉండే అనుకూల వాతావరణంలో మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

శాస్త్రవేత్తలను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్న అంశం బ్యాక్టీరియా మనుగడ కాదు.. వాటిలో వచ్చే మార్పులు. తీవ్ర ఒత్తిడి పరిస్థితుల్లో కొన్ని సూక్ష్మజీవులు మరింత విషపూరితంగా మారడం, యాంటీబయోటిక్‌ మందులకు తట్టుకునే సామర్థ్యం పెరగడం, రక్షణ పొరలు ఏర్పరచుకోవడం వంటి మార్పులు భూమిపై ఇప్పటికే గుర్తించారు. మార్స్‌ ప్రయాణాలు నెలలు, సంవత్సరాలు కొనసాగితే ఇలాంటి మార్పులు మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని అధ్యయనం చెబుతోంది.

అంతరిక్షంలో ఎక్కువకాలం గడిపిన వ్యోమగాముల్లో రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుందని గత పరిశోధనలు వెల్లడించాయి. అదే సమయంలో బ్యాక్టీరియా మరింత బలపడితే ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే భవిష్యత్‌ మార్స్‌ యాత్రల్లో వ్యోమగాముల ఆరోగ్యంతో పాటు వారి శరీరంలోని సూక్ష్మజీవులను కూడా నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

అయితే ఇవన్నీ ఇప్పటికైతే అవకాశాల స్థాయిలో ఉన్న అంశాలేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మార్స్‌పై గ్రహాంతర సూక్ష్మజీవులు ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ భవిష్యత్‌ అంతరిక్ష యాత్రలను మరింత సురక్షితంగా నిర్వహించాలంటే ఇలాంటి ప్రమాదాలపై ముందుగానే పరిశోధనలు అవసరమని అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Mars
Space Bacteria
Human Spaceflight
Antibiotic Resistance
University of Edinburgh
Astronaut Health

More Telugu News