టీడీపీ కార్యకర్త మృతి.. పరారీలో వైసీపీ మాజీ సర్పంచ్
- నెల్లూరు జిల్లా తాగేటివారిపాలెంలో తీవ్ర ఉద్రిక్తత
- వైసీపీ వ్యక్తుల చేతిలో దాడికి గురైన టీడీపీ కార్యకర్త చాట్ల వాసు మృతి
- ఒకరి అరెస్ట్.. మరో ముగ్గురు పరారీ
నెల్లూరు జిల్లా కావలి మండలం తాగేటివారిపాలెంలో తీవ్ర ఉద్రిక్తత. ఇటీవల జరిగిన ఒక ఘర్షణలో ప్రత్యర్థుల చేతిలో దారుణంగా గాయపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాట్ల వాసు కన్నుమూశారు. నెల్లూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చికిత్స పొందుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. వాసు మరణంతో గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తతతో కూడిన విషాద వాతావరణం నెలకొంది.
మరోవైపు, ఈ దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే రవిచంద్ర అనే నిందితుడిని పోలీసులు పట్టుకుని, రిమాండ్కు తరలించారు. వైసీపీ స్థానిక నాయకుడు, మాజీ సర్పంచ్ మందా మధును ప్రధాన నిందితుడిగా (A1) చేర్చారు. ఈ మందా మధు కావలి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి అత్యంత ముఖ్య అనుచరుడని చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రధాన నిందితుడు మధుతో పాటు ఈ దాడిలో పాల్గొన్న మరో ఇద్దరు నిందితులు కూడా పరారీలో ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. వాసు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అసలు ఈ ఘర్షణకు దారితీసిన పూర్తి కారణాలు పోలీసుల పూర్తిస్థాయి విచారణలో తేలాల్సి ఉంది.