కోల్‌కతా విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత.. నమాజ్ నిరసనలపై పోలీసుల ఉక్కుపాదం!

Kolkata Airport high tension as police crack down on Namaz protests
  • కోల్‌కతా విమానాశ్రయం పరిధిలో భారీ నిరసనలకు బ్రేక్
  • గౌరీపూర్ జామా మసీదు వద్ద నమాజ్ ఆంక్షలు
  • భద్రతా కారణాల దృష్ట్యా భారీ పోలీసు మోహరింపు
  • బిఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు
  • జాతీయ భద్రతే ముఖ్యమన్న ముఖ్యమంత్రి సువేందు
కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎయిర్‌పోర్ట్ లోపల ఉన్న 136 ఏళ్ల నాటి చారిత్రక గౌరీపూర్ జామా మసీదును వేరే చోటుకు తరలించే (రీలొకేషన్) ప్రతిపాదనలపై రాజకీయంగా, సామాజికంగా వివాదం చెలరేగింది. భద్రతా కారణాల దృష్ట్యా సాధారణ భక్తుల ప్రవేశంపై అధికారులు ఆంక్షలు విధించడంతో, దీనికి వ్యతిరేకంగా శుక్రవారం మసీదు కమిటీ, జమియా ఉలేమా-ఏ-హింద్ సంయుక్తంగా పిలుపునిచ్చిన భారీ నిరసన ప్రదర్శనను పోలీసులు భగ్నం చేశారు. ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.

ఎయిర్‌పోర్ట్ గేట్ నంబర్ 7, బాంక్రా క్రాసింగ్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడకుండా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బిఎన్ఎస్ఎస్) లోని 163 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. మాజీ మంత్రి సిద్ధిఖుల్లా చౌదరి నేతృత్వంలో నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ఎత్తున శుక్రవారం న నమాజ్ నిర్వహించేందుకు భక్తులు ప్రయత్నించగా, పోలీసులు భారీగా బలగాలను, వాటర్ కానన్లను రంగంలోకి దించారు. అక్కడ ఉన్న ఉత్కంఠ పరిస్థితులను చూసిన సిద్ధిఖుల్లా చౌదరి, పోలీసు ఉన్నతాధికారులతో చర్చల అనంతరం నిరసనను ప్రస్తుతానికి విరమించుకుంటున్నట్లు ప్రకటించి, ప్రార్థనలను వేరే చోట నిర్వహించారు.

ఈ వివాదం వెనుక దశాబ్దాల నాటి విమానయాన భద్రతా కారణాలు ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్ లోపల రన్‌వేకు కేవలం 165 మీటర్ల దూరంలో, అత్యంత సున్నితమైన లెవెల్-3 సెక్యూరిటీ జోన్ పరిధిలో ఈ మసీదు ఉంది. ఇప్పటివరకు కేవలం గుర్తింపు కార్డులు చూపించి స్థానికులు లోపలికి వెళ్లేవారు. అయితే ఇలా ఎయిర్‌పోర్ట్ లోపలికి వందలాది మందిని అనుమతించడం జాతీయ భద్రతకు ముప్పని కేంద్ర నిఘా సంస్థలు తేల్చిచెప్పాయి. అంతేకాకుండా, విమానాశ్రయ రెండో రన్‌వే విస్తరణకు ఈ కట్టడం అడ్డుగా మారడంతో, దీనిని వేరే చోటుకు తరలించేందుకు అధికారులు కసరత్తులు ప్రారంభించారు.

మత స్వేచ్ఛ వేరు.. దేశ భద్రత వేరు: సీఎం
ఈ వివాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పందిస్తూ.. ప్రభుత్వం ఎవరి మత స్వేచ్ఛనూ హరించడం లేదని స్పష్టం చేశారు. "మాకు దేశ భద్రత, ఎయిర్‌పోర్ట్ భద్రతే అన్నింటికంటే ముఖ్యం. చైనా, బంగ్లాదేశ్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం గేట్లను ఎవరికైనా ఇలాగే తెరిచి ఉంచలేము. చట్టపరమైన ప్రక్రియ ప్రకారమే మసీదు తరలింపుపై చర్యలు ఉంటాయి" అని తేల్చి చెప్పారు.  
Advertisement
Kolkata Airport
Gauripur Jama Masjid
Siddiqullah Chowdhury
Suvendu Adhikari
Airport Security Protest
West Bengal News

More Telugu News