లాలూ ప్రసాద్ యాదవ్‌కు అస్వస్థత.. పట్నా ఆసుపత్రిలో చేరిక

Lalu Prasad Yadav unwell admitted to Patna hospital
  • పట్నాలోని ఐజీఐఎంఎస్ ఆసుపత్రిలో చేరిక
  • ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స
  • గతంలో కిడ్నీ మార్పిడి, గుండె సంబంధిత సమస్యలు
  • ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకుంటున్న మద్దతుదారులు
రాష్ట్రీయ జనతా దళ్ (RJD) జాతీయ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు పట్నాలోని ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (IGIMS) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.

లాలూ ఆసుపత్రిలో చేరిన సమయంలో ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి, కుమార్తె, రాజ్యసభ ఎంపీ మీసా భారతి వెంట ఉన్నారు. 76 ఏళ్ల లాలూ వయసు, గత ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల పట్నాలోని కౌటిల్య నగర్‌లో వైద్య సదుపాయాలు ఉన్న నూతన నివాసానికి మారారు. అయినప్పటికీ, ఆయన ఆరోగ్యం అనూహ్యంగా క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. లాలూ అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలియగానే ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.

లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 2022 డిసెంబర్‌లో సింగపూర్‌లో ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఆ సమయంలో ఆయన కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేశారు. కిడ్నీ సమస్యలతో పాటు ఆయన గుండె జబ్బులు, రక్తపోటు (హైపర్‌టెన్షన్‌) వంటి సమస్యలతోనూ సతమతమవుతున్నారు.                                
Advertisement
Lalu Prasad Yadav
RJD Chief
IGIMS Patna Hospital
Bihar Former CM
Rabri Devi
Misa Bharti

More Telugu News