రండి.. చట్టాన్ని ఎదుర్కోండి: షేక్ హసీనా రాకపై బంగ్లాదేశ్ సర్కార్ స్పందన
- ఈ ఏడాది చివరి నాటికి బంగ్లాదేశ్ వెళతానంటున్న షేక్ హసీనా
- హసీనాకు స్వాగతమన్న ప్రధాని రెహమాన్ సలహాదారు జాహెద్
- అయితే తనపై ఉన్న కేసులను హసీనా ఎదుర్కోవాలని వ్యాఖ్య
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలపై అక్కడి ప్రస్తుత ప్రభుత్వం అత్యంత దూకుడుగా స్పందించింది. ఆమె ఢాకాకు రావాలనుకోవడాన్ని తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని పేర్కొంటూనే.. దేశద్రోహం, మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో మరణశిక్ష పడిన నేరస్థురాలిగా ఆమె చట్టాన్ని ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.
అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ లో జరిగే ఈ విచారణ అంతా పారదర్శకంగా ఉంటుందని, ప్రపంచ దేశాల పరిశీలకులు దీనిని గమనించవచ్చని చెప్పారు. ఒకవేళ కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తే దానికి కూడా తాము సిద్ధమేనని, హసీనా రాకపై ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.
గత ఏడాది నవంబర్లో ఢాకాలోని ప్రత్యేక ట్రైబ్యునల్... విద్యార్థుల నిరసనల అణచివేత కేసులో హసీనాకు ఆమె లేని సమయంలోనే మరణశిక్ష విధించింది. అయితే ఈ కేసులన్నీ రాజకీయ కక్షసాధింపు చర్యలేనని హసీనా కొట్టిపారేస్తున్నారు. అప్పటినుంచి ఆమెను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ భారత్ను కోరుతోంది.