ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అమెజాన్ డేటా సెంటర్ మైలురాయి: సీఎం రేవంత్

Revanth Reddy lays foundation for Amazon Data Center in Hyderabad Future City
  • ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు రేవంత్ శంకుస్థాపన
  • 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న సీఎం
  • ఫ్యూచర్ సిటీలో ఫార్చూన్-500 కంపెనీలకు ఆహ్వానం
  • మెట్రో విస్తరణ, ఈవీ బస్సులు, మూసీ ప్రక్షాళనకు ప్రాధాన్యం
  • భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందించాలని ఆదేశం
ఫ్యూచర్ సిటీని ప్రపంచంలోనే అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని, దీనివల్ల మరిన్ని పెట్టుబడులు, అంతర్జాతీయ పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చే అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఫ్యూచర్ సిటీలో ఫార్చూన్-500 కంపెనీలను ఆహ్వానిస్తున్నామని రేవంత్‌ తెలిపారు. గతేడాది నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌కు 108 దేశాల నుంచి పరిశ్రమలు పాల్గొన్నాయని గుర్తు చేశారు. 2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్నారు. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దతామని పేర్కొన్నారు. 2047 నాటికి దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో తెలంగాణ వాటా 10 శాతం ఉండేలా కృషి చేస్తామని అన్నారు.

ఈ లక్ష్యాల సాధనకు భారీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు అవసరమని, అందుకే ‘తెలంగాణ రైజింగ్’ విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం మంత్రులు, అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు నగరంలోని పరిశ్రమలను దశలవారీగా తరలిస్తామని, మెట్రో విస్తరణ చేపడతామని సీఎం వెల్లడించారు. డీజిల్ తో నడిచే ఆర్టీసీ బస్సులను నగరం వెలుపలికి తరలించి, వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నగరంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి జీరో ట్యాక్స్ విధించే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

మూసీ నదిని పూర్తిగా ప్రక్షాళన చేసి కాలుష్య రహితంగా మారుస్తామని, మెట్రో విస్తరణ, మూసీ పునరుద్ధరణ, పరిశ్రమల తరలింపుతో కూడిన ప్రాంతాన్ని ‘కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్‌)’గా అభివృద్ధి చేస్తామని వివరించారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో సేవల రంగానికి అనుగుణంగా పునర్నిర్మిస్తామని చెప్పారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు 10 కిలోమీటర్ల పరిధిని తయారీ పరిశ్రమల (మ్యాన్యుఫ్యాక్చరింగ్) జోన్‌గా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

ఫ్యూచర్ సిటీ కోసం భూములు ఇచ్చిన రైతుల సేవలను ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని రేవంత్‌ అన్నారు. వారికి ఎలాంటి నష్టం జరగకుండా తగిన పరిహారం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
Advertisement
Revanth Reddy
Amazon Data Center
Telangana Future City
Hyderabad Development
Telangana Economy
Telangana Rising

More Telugu News