రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?: వైసీపీకి సోమిరెడ్డి సవాల్

Somireddy Chandra Mohan Reddy challenges YSRCP for open debate on Rayalaseema projects
  • రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ ఇప్పుడు సమీక్షల పేరుతో డ్రామా ఆడుతోందని సోమిరెడ్డి విమర్శ
  • టీడీపీ 24 నెలల్లో రూ. 12,484 కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ ఐదేళ్లలో చేసిందేమీ లేదని ఆరోపణ
  • ఎన్జీటీ ఇచ్చిన స్టేను నాలుగేళ్ల పాటు ఎందుకు ఎత్తించలేకపోయారని జగన్‌కు సూటిగా ప్రశ్న
  • రాయలసీమ ప్రాజెక్టుల చరిత్ర, ఖర్చులపై వైసీపీతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్
  • జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారని, మైక్రో ఇరిగేషన్‌ను రద్దు చేసి సీమకు ద్రోహం చేశారని ఫైర్
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైసీపీ ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపిందని, ఐదేళ్ల పాలనలో వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు సమీక్షల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రాజెక్టులపై తాము చేసిన ఖర్చు, వైసీపీ హయాంలో జరిగిన నిర్లక్ష్యంపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే రావాలని ఆయన సవాల్ విసిరారు. ఈరోజు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వంపై, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

రాయలసీమ లిఫ్ట్‌పై ఇప్పుడు డ్రామాలు
2020లోనే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (ఆర్‌ఎల్‌ఐఎస్) పనులపై స్టే ఇచ్చిందని సోమిరెడ్డి గుర్తుచేశారు. "అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ అల్లుడు, మంత్రి హరీశ్ రావు తామే 18 లేఖలు రాసి, కేసులు వేసి ఆర్‌ఎల్‌ఐఎస్ పనులను ఆపించామని ఆనాడు 'నమస్తే తెలంగాణ' పత్రికలో గొప్పగా చెప్పుకున్నారు. మరి, కేసీఆర్‌తో స్నేహంగా ఉన్న జగన్.. ఆ స్టేను నాలుగేళ్ల పాటు ఎందుకు ఎత్తివేయించలేకపోయారు? ఇప్పుడు అధికారం కోల్పోయాక 'గొడ్డలి పార్టీ' నాయకులు సమీక్షలు, రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో కొత్త నాటకాలు ఆడుతున్నారు. ఈ సమీక్షలు మీ తాడేపల్లి ప్యాలెస్‌లో పెట్టుకుని, ఐదేళ్లలో మీరేం చేశారో ఆత్మపరిశీలన చేసుకోండి" అని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.

ఖర్చులో పోలికే లేదు
టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి ప్రాజెక్టులపై ఉన్న చిత్తశుద్ధికి ఖర్చు చేసిన నిధులే నిదర్శనమని సోమిరెడ్డి పేర్కొన్నారు. "మేం అధికారంలోకి వచ్చిన వెంటనే 24 నెలల్లోనే ప్రాజెక్టులపై రూ. 12,484 కోట్లు ఖర్చు చేశాం. మరో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు 2019 నుంచి 2024 వరకు ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయగలరా? వైసీపీ నేత, ఉరవకొండ ఇన్‌ఛార్జ్ విశ్వేశ్వర్ రెడ్డే స్వయంగా తమ ప్రభుత్వ హయాంలో సీమకు ఏమీ చేయలేకపోయామని అంగీకరించారు. దీన్నిబట్టి చూస్తే రాయలసీమకు ద్రోహం చేసింది ఎవరో స్పష్టమవుతోంది" అని విమర్శించారు.

చరిత్ర టీడీపీది.. విధ్వంసం వైసీపీది
తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, వాటిని అత్యధికంగా పూర్తి చేసింది స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు అని సోమిరెడ్డి గుర్తుచేశారు. "జగన్ రెడ్డి జీఓ 365 పేరుతో రాయలసీమలోని 102 సాగునీటి ప్రాజెక్టుల పనులను రద్దు చేశారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే 39 మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జలాల్లో మిగులు జలాలు కోరబోమని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌కు లేఖ రాసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీమకు తీరని అన్యాయం చేశారు. జలయజ్ఞం పేరుతో మీరు చేసింది ధనయజ్ఞం మాత్రమే" అని ఆరోపించారు.

మైక్రో ఇరిగేషన్‌ను చంపేశారు
రాయలసీమ వంటి కరవు ప్రాంతానికి అత్యంత కీలకమైన మైక్రో ఇరిగేషన్ (బిందు, తుంపర సేద్యం) పథకాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సోమిరెడ్డి మండిపడ్డారు. "చంద్రబాబు హయాంలో 5 ఎకరాల సబ్సిడీని 10 ఎకరాలకు పెంచి, డ్రిప్ ఇరిగేషన్‌లో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపాం. కానీ జగన్ రాగానే ఆ పథకాన్ని రద్దు చేశారు. దీంతో రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోయారు. పులివెందుల రెడ్లే తన వద్దకు వచ్చి ఈ విషయం అడుగుతున్నారని అప్పటి వ్యవసాయ మంత్రి కన్నబాబు జగన్‌తో చెప్పినా, 'నీ పని నువ్వు చూసుకో' అని విసుక్కున్నారంటే సీమ రైతులపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది" అని సోమిరెడ్డి అన్నారు.

కూటమి ప్రభుత్వం కార్యాచరణ
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని సోమిరెడ్డి తెలిపారు. "నిర్వీర్యమైన పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టాం. కృష్ణా డెల్టాకు నీళ్లు లేకపోతే పట్టిసీమ ద్వారా 7 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నాం. రూ. 35,313 కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చంద్రబాబు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. సాగునీటి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిజాయతీగా, కష్టపడి పనిచేస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసే వైసీపీ నేతలకు రాయలసీమ పేరు ఎత్తే అర్హత కూడా లేదు" అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
Somireddy Chandra Mohan Reddy
Rayalaseema Irrigation Projects
TDP vs YSRCP Debate
Andhra Pradesh Water Resources
Jagan Mohan Reddy
RLIS Project Controversy

More Telugu News