సింగరేణికి పట్టిన శని ఆ రెండు పార్టీలే.. దోచుకుతిన్నారు: కిషన్ రెడ్డి

Kishan Reddy says BRS and Congress looted Singareni and ruined its future
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సింగరేణిని దోచుకుతిన్నాయన్న కిషన్ రెడ్డి
  • సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపణ
  • సింగరేణిని కాపాడుకోవడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి

తెలంగాణకు గుండెచప్పుడు లాంటి సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి నిలువునా ముంచేశాయని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ కుటుంబం, కాంగ్రెస్ పాలకులు పోటీపడి మరీ సింగరేణిని తమ సొంత ఖజానాలా వాడుకున్నారని మండిపడ్డారు. కార్మికుల చెమట వాసన తెలిసిన సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టి, ఇప్పుడు దాని భవిష్యత్తును పూర్తిగా అంధకారంలోకి నెట్టేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.


సింగరేణి నుంచి బొగ్గు కొనుగోలు చేసి, విద్యుత్ వాడుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను తుంగలో తొక్కిందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం సుమారు రూ. 30 వేల కోట్ల బకాయిలు పెట్టిపోతే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానికి మరో రూ. 24 వేల కోట్లు జోడించిందని మండిపడ్డారు. ఇలా మొత్తం రూ. 54 వేల కోట్ల కార్మికుల కష్టార్జితాన్ని అప్పులపాలు చేసి, సంస్థను ఆర్థిక సంక్షోభంలోకి తోశారని ఆరోపించారు. కేసీఆర్ తన హయాంలో సింగరేణి బోర్డును ఉత్సవ విగ్రహంగా మార్చి, టెండర్ల పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు.


రాజకీయాలు చేయడానికి తాను ఇక్కడికి రాలేదని, సింగరేణిని కాపాడుకోవడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గత పాలకులు సంస్థ ఆదాయాన్ని ఫుట్‌బాల్ మ్యాచ్‌లు వంటి అనవసరమైన వాటికి మళ్లించారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ హయాంలో సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయించి కార్మికులకు అసలైన భరోసా కల్పించామన్నారు. సింగరేణి మనుగడ కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా కేంద్రం అండగా నిలబడుతుందని, కార్మికుల ప్రయోజనాలను కాపాడి తీరుతామని ఆయన హామీ ఇచ్చారు.

Advertisement
Kishan Reddy
Singareni
BRS Congress Singareni Controversy
Telangana Coal Mining
SCCL Financial Crisis
Tadicherla 2 Coal Block

More Telugu News