ఈ-20 పెట్రోల్‌పై ఎన్‌డీఏ ఓటర్లకూ గుబులు!: వాహనాలు పాడవుతాయని మెజారిటీ జనం భయం.. 'సీ-ఓటర్' సర్వేలో సంచలన విషయాల వెల్లడి

E 20 Petrol concerns NDA voters as CVoter survey reveals fear of vehicle damage
  • ఇథనాల్ కలిపిన ఈ-20 పెట్రోల్ వాడకానికి 55 శాతం మంది విముఖత
  • సొంత కూటమి ఎన్‌డీఏ మద్దతుదారుల్లోనూ 52.5 శాతం వ్యతిరేకత
  • ఈ-20 వల్ల మైలేజ్ తగ్గుతుందని 52.8 శాతం మంది నమ్మకం
  • వాహన ఇంజిన్లు దెబ్బతింటాయంటూ వాహనదారుల్లో తీవ్ర ఆందోళన
  • ధర తగ్గించినా ఇథనాల్ ఇంధనం వాడేందుకు జనం సముఖంగా లేరని వెల్లడి
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానంపై దేశవ్యాప్తంగా వాహనదారుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేంద్రంలోని అధికార ఎన్‌డీఏ కూటమిని సమర్థించే ఓటర్లు సైతం ఈ సరికొత్త ఇంధనాన్ని వాడేందుకు ఇష్టపడటం లేదని ప్రముఖ పరిశోధన సంస్థ 'సీ-ఓటర్' నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గడమే కాకుండా, ఇంజిన్లు దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఆందోళన దేశ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.

నితిన్ గడ్కరీ సవాల్.. ఆందోళనకారుల ప్రతిసవాల్!
ఈ-20 పెట్రోల్ వల్ల నష్టపోయిన ఒక్కరినైనా చూపించాలంటూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల విమర్శకులకు సవాల్ విసిరారు. అయితే, దీనిపై నిరసనకారులు తక్షణమే స్పందించారు. ఒక్కరిని కాదు.. ఇథనాల్ పెట్రోల్ వాడి తమ వాహనాలు పాడైపోయాయని లబోదిబోమంటున్న ఆరుగురు బాధితులను మంత్రి ముందర నిలబెడతామని ప్రతిసవాల్ చేశారు. అయితే మీడియా ముందుకు వెళ్లేకంటే ముందే, ఈ విషయమై గడ్కరీ తమతో నేరుగా సమావేశం కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఇంధనం సురక్షితమేనని చెబుతున్నప్పటికీ, ముఖ్యంగా పాత వాహనాల యజమానులు ఈ విధానం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన చెందుతున్నారు.

ఎన్‌డీఏ ఓటర్లలోనూ అదే భయం
సీ-ఓటర్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దాదాపు 52.5 శాతం మంది ఎన్‌డీఏ మద్దతుదారులు తమ వాహనాల్లో ఈ-20 పెట్రోల్ వాడటానికి నిరాకరించగా, కేవలం 18.1 శాతం మంది మాత్రమే మొగ్గు చూపారు. ఇక ప్రతిపక్షాల మద్దతుదారుల్లో ఈ వ్యతిరేకత 57.9 శాతంగా ఉంది. మొత్తం మీద చూసుకుంటే దేశంలో 55.1 శాతం మంది వాహనదారులు ఈ ఇంధనానికి నో చెబుతున్నారు. ఇథనాల్ కలపడం వల్ల మైలేజ్ తగ్గుతుందని 52.8 శాతం మంది, అసలు వాహనాలే పాడైపోతాయని 54.2 శాతం మంది బలంగా నమ్ముతున్నారు.

ధర తగ్గించినా వద్దే వద్దు!
సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ కలిపిన పెట్రోల్ ధర తక్కువగా ఉండాలని 74.5 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే, ఒకవేళ ప్రభుత్వం ధర తగ్గించి అమ్మినా కూడా.. తాము ఈ-20 పెట్రోల్‌కు మారబోమని 40.4 శాతం మంది కుండబద్దలు కొట్టారు. అలాగే పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో పాటు, పాత పద్ధతిలోని సాధారణ పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచాలని, దేన్ని వాడాలో ఎంచుకునే స్వేచ్ఛ కస్టమర్లకే వదిలేయాలని 75.9 శాతం మంది డిమాండ్ చేస్తున్నారు. ముడిచమురు దిగుమతులు తగ్గించుకోవడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాహనదారుల నమ్మకాన్ని గెలవడంలో ప్రభుత్వం వెనుకబడిందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.
Advertisement
Nitin Gadkari
E20 Petrol
CVoter Survey
Ethanol Blended Petrol
Vehicle Engine Damage
NDA Voters Opinion

More Telugu News