హ‌ర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. భారత్‌ ఇంధన భద్రతకు గండం.. చమురు కంటే ఎల్‌పీజీకే ఎక్కువ ముప్పు?

Strait of Hormuz tensions pose threat to India energy security with LPG at higher risk than oil
  • చమురు, గ్యాస్ దిగుమతుల బిల్లులు భారీగా పెరిగే ప్రమాదం
  • చమురు కంటే ఎల్‌పీజీ సరఫరాపైనే ప్రభావం అధికమంటున్న నిపుణులు 
  • పరిశ్రమలకు పైప్డ్ గ్యాస్ అందించడమే దీర్ఘకాలిక పరిష్కారమని సూచన
ప‌శ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణపూరిత వాతావరణం మరింత ముదురుతుండటంతో భారత్ ఇంధన భద్రత మరోసారి తీవ్ర ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ సంక్షోభం మరింత తీవ్రమైతే దేశీయంగా చమురు, సహజవాయువు దిగుమతులపై వ్యయం భారీగా పెరగడమే కాకుండా సరఫరాలో అంతరాయాలు ఏర్పడవచ్చని ప్రముఖ ఇంధన రంగ ఆర్థికవేత్త కిరీట్ పారిఖ్ హెచ్చరించారు. హ‌ర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించే భారతీయ నావికుల భద్రతపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

ఎన్డీటీవీతో మాట్లాడుతూ కిరీట్ పారిఖ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. "మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత ఉద్ధృతమైతే, భారత్‌కు చమురు, గ్యాస్ దిగుమతుల వ్యయం భారీగా పెరుగుతుంది. అమెరికా దాడుల తర్వాత ఇరాన్ పలు గల్ఫ్ దేశాలపై బాంబు దాడులకు పాల్పడింది. ఇది కేవలం నౌకాయానంపైనే కాకుండా చమురు, గ్యాస్ ఉత్పత్తిపై కూడా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది" అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని చమురు, ఎల్‌ఎన్‌జీ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించే హ‌ర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడం ఆందోళన కలిగించే అంశమని తెలిపారు.

చమురు కంటే ఎల్‌పీజీకే ఎక్కువ ముప్పు
గత కొన్నేళ్లుగా భారత్ ముడిచమురు దిగుమతుల కోసం వివిధ దేశాలపై ఆధారపడుతూ వైవిధ్యం సాధించింది. దీంతో చమురు సరఫరాకు తక్షణ ముప్పు లేనప్పటికీ, ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దేశీయ ఎల్‌పీజీ అవసరాల కోసం భారత్ ఇప్పటికీ గల్ఫ్ దేశాలపైనే అధికంగా ఆధారపడి ఉంది. ఈ దిగుమతులు హ‌ర్మూజ్ జలసంధి మార్గం గుండానే జరుగుతుండటంతో సంక్షోభం పెరిగితే ఎల్‌పీజీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హిందుస్థాన్ నేషనల్ గ్లాస్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ (హెచ్ఎన్‌జీఐఎల్‌) చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సూరజ్ మెహతా కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేశారు. "చమురు, ఎల్‌పీజీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పరిశ్రమలు ప్రత్యక్షంగా ఎదుర్కొంటాయి. రిఫైనరీలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి. కానీ, గాజు పరిశ్రమ వంటి వాటికి ఎల్‌పీజీ సరఫరాలో కొరత ఏర్పడితే ఉత్పత్తి తక్షణమే నిలిచిపోతుంది" అని ఆయన వివరించారు. 

అయితే, ఈసారి పరిశ్రమలు మరింత సన్నద్ధంగా ఉన్నాయని, ఇంధన నిల్వలను పెంచుకోవడంతో పాటు పెట్రోలియం మంత్రిత్వ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. పరిశ్రమలకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) సరఫరాను వేగవంతం చేయడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని ఆయన సూచించారు.

దౌత్యమే శరణ్యం
భారత్ తన ఇంధన అవసరాలను కాపాడుకోవడానికి దౌత్యపరమైన చర్చలను ముమ్మరం చేయాలని కిరీట్ పారిఖ్ సూచించారు. టెహ్రాన్, వాషింగ్టన్ రెండు దేశాలతోనూ చర్చలు జరిపి, భారత పోర్టులకు వచ్చే చమురు, ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్లకు సురక్షిత మార్గాన్ని నిర్ధారించుకోవాలని ఆయన అన్నారు. ఇటీవల 11 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న ఓ నౌకపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ.. "ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. భారత నావికుల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి" అని పారిఖ్ స్పష్టం చేశారు.
Advertisement
Strait of Hormuz
India Energy Security
LPG Imports
US Iran Conflict
Kirit Parikh
Oil Supply Disruption

More Telugu News