ప్రియాంక గాంధీ ఎక్కడ? వయనాడ్‌ దుర్ఘటన నేపథ్యంలో బీజేపీ విమర్శలు

Priyanka Gandhi where BJP criticizes in the wake of Wayanad disaster
  • వయనాడ్‌లో ఇటీవల విరిగిపడ్డ కొండచరియలు
  • ఎనిమిది మంది మృతి
  • స్థానిక ఎంపీ ప్రియాంక ఇప్పటి వరకు ఘటనా స్థలాన్ని పరిశీలించలేదని బీజేపీ విమర్శలు
  • బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వలేదంటూ మండిపాటు
  • కాంగ్రెస్‌కు వయనాడ్‌ రాజకీయ పావుగా మారిందని విమర్శ
కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల కొండచరియలు విరిగిపడ్డ నేపథ్యంలో స్థానిక ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆమె ఇప్పటివరకు బాధిత ప్రాంతాన్ని సందర్శించలేదని ఆరోపించింది. మృతుల కుటుంబాలను కూడా పరామర్శించలేదని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ అన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడం తప్ప బాధితులకు ఆమె ఏమాత్రం అండగా నిలవలేదని విమర్శించారు.

కాంగ్రెస్‌కు వయనాడ్ కేవలం రాజకీయ పావుగా మారిందని కేశవన్‌ వ్యాఖ్యానించారు. గతంలో ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ కూడా నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టలేదన్నారు. రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి వయనాడ్ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు అదే రాజకీయ శైలి ప్రియాంక గాంధీ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.

జులై 7న వయనాడ్ జిల్లా అనక్కంపోయిల్-మెప్పాడి ట్విన్ ట్యూబ్ టన్నెల్ ప్రాజెక్టు పనులు జరుగుతున్న కల్లాడి ప్రాంతంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం ఐదు రోజుల పాటు గాలింపు చర్యలు కొనసాగాయి. చివరగా విక్రమ్ రాణా మృతదేహాన్ని ఆదివారం సహాయక బృందాలు వెలికితీశాయి. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.

చివరి మృతదేహం లభించడంతో ప్రమాద స్థలంలో కొనసాగుతున్న గాలింపు, సహాయక చర్యలను అధికారులు ముగించారు. ఈ ఆపరేషన్‌లో జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజీ), అగ్నిమాపక శాఖ, ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు, అటవీ శాఖ సిబ్బంది, యువజన స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. ఈ ఘటనపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నప్పటికీ, బాధిత కుటుంబాలకు సాయం అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
Advertisement
Priyanka Gandhi
Wayanad Landslides
BJP
CR Kesavan
Kerala News
Congress Party

More Telugu News