మమ్మల్ని చాలా ఏడిపించారు.. మా మధ్య గొడవలు పెట్టారు: జానకితో అనుబంధంపై సుశీల భావోద్వేగం

S Janaki Death They Made Us Cry And Created Fights Between Us Says P Susheela
  • ప్రముఖ గాయని ఎస్. జానకి మృతిపై స్పందించిన గాయని పి.సుశీల
  • తమ మధ్య కొందరు విభేదాలు సృష్టించి ఏడిపించారని ఆవేదన
  • జానకి మరణంతో వారి కళ్లు చల్లబడ్డాయా? అంటూ ఘాటు వ్యాఖ్యలు
  • జానకి లాంటి గాయని మళ్లీ పుట్టదంటూ భావోద్వేగ నివాళి
ప్రముఖ గాయని ఎస్. జానకి మ‌ర‌ణం వార్త యావత్ సినీ పరిశ్రమను, సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జానకమ్మ మృతి పట్ల ఆమెకు అత్యంత సన్నిహితురాలు, సమకాలీనురాలైన మరో దిగ్గజ గాయని పి. సుశీల కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జానకమ్మతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, తమ మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు చేసిన కుట్రలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

జానకి మృతిపై స్పందించిన సుశీల, తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు కొందరు స్వార్థపరులు చేసిన కుట్రలను ఆమె గుర్తుచేసుకున్నారు. "గతంలో కొందరు వ్యక్తులు నా గురించి జానకికి, జానకి గురించి నాకు లేనిపోనివి కల్పించి చెప్పారు. మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని చూసి మమ్మల్ని చాలా ఏడిపించారు. మానసికంగా ఎంతో వేధించారు" అంటూ సుశీల ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇప్పుడు జానకమ్మ భౌతికంగా దూరమయ్యాక, ఆనాడు తమ మధ్య దూరం పెంచాలనుకున్న ఆ దుర్మార్గుల 'కళ్లు చల్లబడ్డాయా?' అంటూ తీవ్ర ఆవేద‌న‌తో ఆమె ప్రశ్నించారు. వారి కుట్రల వల్ల తాము ఎంతో మానసిక క్షోభ అనుభవించామని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

అనంతరం జానకి గాత్రంలోని వైవిధ్యాన్ని, ఆమె ప్రతిభను సుశీల కొనియాడారు. "జానకి ఒక అద్భుతం. ఆమె గొంతులో మగవారి శబ్దాలు, వృద్ధుల గొంతులు, పసిపిల్లల మాటలు అద్భుతంగా పలికేవి. అలాంటి గాయని ఈ ప్రపంచంలో మరొకరు లేరు, మళ్లీ పుట్టరు" అని ప్రశంసించారు. 

జానకి లేని లోటు పూడ్చలేనిదన్నారు. "బహుశా ఆ సరస్వతీ దేవికే తన లోకంలో కచేరీ చేయించుకోవాలనిపించిందేమో, అందుకే జానకమ్మను తీసుకెళ్లిపోయింది" అంటూ భావోద్వేగానికి గురయ్యారు. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా, ఆమె పాడిన వేలాది పాటల రూపంలో జానకమ్మ ఎప్పటికీ సంగీత ప్రియుల గుండెల్లో జీవించే ఉంటారని సుశీల నివాళులర్పించారు.
Advertisement
S Janaki
P Susheela
S Janaki Death News
Legendary Singer Janaki
Telugu Cinema News
Susheela Janaki Bond

More Telugu News