మేడిగడ్డపై చర్చకు సిద్ధమా?: మంత్రి ఉత్తమ్‌కు జగదీశ్ రెడ్డి సవాల్

Jagadish Reddy challenges Minister Uttam for a debate on Medigadda
  • తెలంగాణలోని కాంగ్రెస్ ఒక 'హైబ్రిడ్ కాంగ్రెస్' అని జగదీశ్ రెడ్డి విమర్శ
  • కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దిగజారిందని ఆరోపణ
  • మేడిగడ్డపై సూచనలిచ్చిన ఇంజనీర్లను సీఎం బెదిరించారని ఫైర్
  • రాష్ట్రంలో నేరాలు 50 శాతం పెరిగాయన్న జగదీశ్ రెడ్డి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి బీజేపీ ఏ విధంగా అన్యాయం చేస్తోందో, కాంగ్రెస్ సైతం అదే బాటలో పయనిస్తోందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆయన 'హైబ్రిడ్ కాంగ్రెస్'గా అభివర్ణించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని జగదీష్ రెడ్డి ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించి, రాష్ట్రాన్ని ధాన్య ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిపారని గుర్తుచేశారు. కానీ, నేడు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై సూచనలు చేసిన రిటైర్డ్ ఇంజనీర్లను జైల్లో పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. నీటి నిల్వలపై అవగాహన లేకుండా వ్యవహరిస్తే భద్రాచలం వంటి ప్రాంతాలకు వరద ముప్పు తప్పదని హెచ్చరించారు.

ఈ అంశంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చకు సిద్ధంగా ఉన్నారా? అని జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో నేరాలు 50 శాతం పెరిగాయని, ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో చర్చించే ధైర్యం అధికార పార్టీకి లేదని విమర్శించారు. ఇంజనీర్లపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Advertisement
Jagadish Reddy
Uttam Kumar Reddy
Medigadda Barrage
Telangana Politics
Kaleshwaram Project
Telangana Congress

More Telugu News