‘యమద్వారం’ దాటితేనే కైలాస యాత్ర.. ఈ ఆసక్తికర విషయం తెలుసా?

Kailash Mansarovar Yatra starts after crossing Yamadwar gateway
  • పవిత్రమైన తీర్థయాత్రల్లో కైలాస మానససరోవర యాత్ర ఒకటి
  • ఈ యాత్రలో తొలి ఆధ్యాత్మిక ఘట్టంగా నిలిచేది యమద్వారం
  • టిబెట్‌లోని ఈ ప్రదేశం కైలాస యాత్ర ప్రారంభ బిందువు
  • ఈ ద్వారం నుంచి వెళితే ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగుపెట్టినట్లు విశ్వాసం
  • యమద్వారాన్ని దాటినవారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్మకం
ప్రపంచంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్రల్లో కైలాస మానససరోవర యాత్ర ఒకటి. హిందువుల విశ్వాసం ప్రకారం పరమశివుడి నివాసమైన కైలాస పర్వతాన్ని దర్శించేందుకు ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు టిబెట్‌కు వెళ్తుంటారు. ఈ యాత్రలో తొలి ఆధ్యాత్మిక ఘట్టంగా నిలిచేది యమద్వారం. టిబెట్‌లోని నగారి ప్రాంతంలో, దర్చెన్‌కు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో 4,750 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం కైలాస యాత్ర ప్రారంభ బిందువుగా భావిస్తారు.

పాప విముక్తికి సంకేతం
‘యమద్వారం’ అంటే యమధర్మరాజు ద్వారం అని అర్థం. హిందూ పురాణాల ప్రకారం పరమశివుడి నివాసాన్ని యమధర్మరాజే కాపాడుతాడని నమ్మకం. ఈ ద్వారంలో నుంచి వెళ్లడం వల్ల భౌతిక బంధాలను విడిచిపెట్టి ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగుపెట్టినట్లుగా భావిస్తారు. అలాగే యమద్వారాన్ని ప్రదక్షిణ చేసి దాటినవారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని, యముని లేఖకుడు చిత్రగుప్తుడు వారి పాపాలను తన లెక్కల పుస్తకం నుంచి తొలగిస్తాడని భక్తుల విశ్వాసం.

అన్ని మతాలకూ పవిత్ర స్థలం
యమద్వారం హిందువులకు మాత్రమే కాకుండా బౌద్ధులు, జైన మతస్థులకు కూడా అత్యంత పవిత్రమైన ప్రదేశం. టిబెటన్ బౌద్ధుల విశ్వాసం ప్రకారం కైలాస పర్వతం ధ్యాన దేవత ‘డెమ్‌చోక్’ నివాసం. అందుకే ప్రతి సంవత్సరం టార్బోచే వద్ద నీలం, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల ప్రార్థనా జెండాలను ప్రత్యేక క్రమంలో ఏర్పాటు చేస్తారు. ఈ ఐదు రంగులు వరుసగా ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమిని సూచిస్తూ ప్రకృతిలోని సమతుల్యతకు ప్రతీకగా భావిస్తారు.

52 కిలోమీటర్ల కైలాస యాత్ర
యమద్వారం నుంచి ప్రారంభమయ్యే కైలాస యాత్ర మొత్తం 52 కిలోమీటర్ల మేర ఉంటుంది. సాధారణంగా ఈ యాత్రను పూర్తి చేయడానికి రెండు నుంచి మూడు రోజులు పడుతుంది. డోల్మా లా పాస్ వంటి ఎత్తైన, క్లిష్టమైన మార్గాల మీదుగా సాగే ఈ యాత్ర శారీరకంగా ఎంతో కఠినమైనదైనా, ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన అనుభవంగా భక్తులు భావిస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం ఒక్కసారి కైలాస యాత్ర చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. 108 సార్లు చేస్తే మోక్షం లభిస్తుందని చెబుతారు.
Advertisement
Yamadwar
Kailash Mansarovar Yatra
Mount Kailash
Tibet Pilgrimage
Lord Shiva
Yamadwar Significance

More Telugu News