హైదరాబాద్‌లో 6 ఏళ్ల మనవరాలితో కారు నడిపించిన ఎస్ఐ.. ప్రశ్నించిన జనంతో వాగ్వాదం!

SI Pujari Tirupathi lets 6-year-old granddaughter drive car in Hyderabad and argues with public
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో వెలుగులోకి ఘటన
  • ప్రశ్నించిన వారిపై అధికార దర్పం ప్రదర్శించిన ఎస్సై
  • ఎస్సై తిరుపతిపై క్రిమినల్ కేసు నమోదు  
  • వారాంతపు డ్రంకెన్ డ్రైవ్‌లో 354 మందిపై కేసులు
చట్టాన్ని రక్షించాల్సిన ఓ పోలీస్ అధికారి బాధ్యతారహితంగా ప్రవర్తించి తీవ్ర విమర్శల పాలయ్యారు. తన ఆరేళ్ల మనవరాలి చేతికి కారు స్టీరింగ్ ఇచ్చి రద్దీ రోడ్డుపై డ్రైవింగ్ చేయించడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఉన్నతాధికారులు స్పందించి సదరు సబ్‌ఇన్‌స్పెక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

సైబరాబాద్ పోలీసుల కథనం ప్రకారం, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడ-బైరాగిగూడ రోడ్డుపై ఎస్సై పూజారి తిరుపతి ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. అత్యంత రద్దీగా ఉండే ఆ మార్గంలో ఒక చిన్నారి కారు నడుపుతుండటాన్ని గమనించిన తోటి వాహనదారులు షాక్‌కు గురయ్యారు. వారు కారును అడ్డుకుని, పసిపిల్లల చేతికి స్టీరింగ్ ఇచ్చి ఇతరుల ప్రాణాలను ఎందుకు ప్రమాదంలోకి నెడుతున్నారని ఎస్సైను నిలదీశారు. 

దీనికి ఆ చిన్నారి "మా తాత పోలీస్ ఆఫీసర్" అని చెప్పగా, ఎస్సై తిరుపతి కూడా "ఇది ఆటో-గేర్ కారు, నా కంట్రోల్‌లోనే ఉంది" అంటూ తన చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీంతో వాహనదారులకు, ఆయనకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ తతంగాన్ని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు తీవ్రంగా స్పందించారు. మైనర్‌కు వాహనం ఇవ్వడం, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించడం వంటి నేరాల కింద ఎస్సై తిరుపతిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 125, మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్లు 184, 180 కింద నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు ఆదివారం రాత్రి అధికారికంగా ప్రకటించారు.

డ్రంకెన్ డ్రైవ్‌లో 354 మందిపై కేసులు
మరోవైపు, వారాంతంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 354 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిలో 18 మంది రక్తంలో ఆల్కహాల్ స్థాయి (బీఏసీ) 301 ఎంజీ నుంచి 550 ఎంజీ మధ్య అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాంతక ప్రమాదాలకు కారణమైతే, బీఎన్ఎస్-2023లోని సెక్షన్ 105 కింద 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని పోలీసులు హెచ్చరించారు.
Advertisement
Pujari Tirupathi
Cyberabad Police
Narsingi Police Station
Hyderabad SI Viral Video
Minor Driving Case Hyderabad
Traffic Rules Violation

More Telugu News