పెన్షన్ కోసం వెళితే.. ఖాతాలో రూ. 759 కోట్లు.. అవాక్కైన వృద్ధుడు!

Elderly man shocked to find 759 crore in bank account while checking pension
  • బీహార్‌లో వృద్ధుడి ఖాతాలో రూ. 759 కోట్లు ప్రత్యక్షం
  • వృద్ధాప్య పెన్షన్ విత్‌డ్రా చేసేందుకు వెళ్లగా వెలుగులోకి ఘటన 
  • ఆయన కుమారుడి ఖాతాలోనూ భారీ మొత్తం ఉన్నట్టు గుర్తింపు
  • తండ్రీకొడుకుల ఖాతాల్లో కలిపి రూ. 1500 కోట్లకు పైగా బ్యాలెన్స్
  • సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగి ఉంటుందని అనుమానం
వృద్ధాప్య పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు వెళ్లిన ఓ వృద్ధుడు తన బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూసి నిశ్చేష్టుడయ్యారు. ఆయన ఖాతాలో ఏకంగా రూ. 759 కోట్లకు పైగా నగదు ఉన్నట్టు కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. ఆయన కుమారుడి ఖాతాలోనూ ఇదే తరహాలో భారీ మొత్తం ఉండటం గమనార్హం. ఈ విచిత్ర ఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో నిన్న‌ చోటుచేసుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగానే ఇలా జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. ముజఫర్‌పూర్‌కు చెందిన 82 ఏళ్ల కమేశ్వర్ మిశ్రా వృత్తిరీత్యా కవి. ఆయన గత ఆదివారం తన వృద్ధాప్య పెన్షన్ డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు (సీఎస్‌సీ) వెళ్లారు. ఆయనతో పాటు వికలాంగుల పెన్షన్ తీసుకునేందుకు ఆయన కుమారుడు కూడా వెళ్లారు. పెన్షన్ డబ్బులు చేతికి అందిన తర్వాత మిశ్రా సరదాగా తన అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఆపరేటర్ బ్యాలెన్స్ చూపించగానే ఆయన కళ్లు బైర్లు కమ్మాయి. ఆయన ఖాతాలో రూ. 759,69,51,951 ఉన్నట్టు స్క్రీన్‌పై కనిపించింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆయన, తన కుమారుడి అకౌంట్ బ్యాలెన్స్ కూడా చెక్ చేయమని కోరారు. అందులోనూ దాదాపు ఇంతే మొత్తంలో డబ్బు ఉన్నట్టు తేలింది. తండ్రీకొడుకుల ఖాతాల్లో కలిపి ఏకంగా రూ. 1,500 కోట్లకు పైగా ఉండటంతో మిశ్రా కుటుంబంతో పాటు సీఎస్‌సీ ఆపరేటర్ కూడా షాక్‌కు గురయ్యారు.

ఈ విషయంపై కమేశ్వర్ మిశ్రా మాట్లాడుతూ, తన ఖాతాలోకి ఇంత భారీ మొత్తం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని అన్నారు. ఇందులో ఏదైనా పొరపాటు జరిగి ఉంటుందని, సంబంధిత బ్యాంకు అధికారులు వెంటనే దీనిపై విచారణ జరిపి తప్పును సరిదిద్దాలని కోరారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే తాను బహిరంగంగా చెబుతున్నానని వివరించారు.

అయితే, ఈ ఘటనపై బ్యాంకు నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ప్రాథమికంగా ఇది సాంకేతిక లేదా బ్యాంకింగ్ వ్యవస్థలోని గ్లిచ్ వల్లే జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అసలు కారణం తెలియాలంటే బ్యాంకు అధికారులు స్పందించాల్సి ఉంది.
Advertisement
Kameshwar Mishra
Bihar bank account glitch
Muzaffarpur pension news
759 crore bank balance
Banking technical error
Bihar elderly man news

More Telugu News