రామాలయ విరాళాల కేసు.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణకు కాంగ్రెస్‌ డిమాండ్‌

Congress leader KC Venugopal alleges misuse of Ayodhya Ram Temple funds
  • సిట్‌ అసలు నిందితులను కాపాడుతోందని ఆరోపణ
  • సీసీటీవీ ఫుటేజీ తొలగించారని విమర్శ
  • పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తనున్న కాంగ్రెస్‌
  • భక్తుల విశ్వాసంతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపణ
  • మోదీ, షా మౌనం అనుమానాలకు తావిస్తోందని విమర్శ
అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై కాంగ్రెస్‌ మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ చేసింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అసలు నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. కేంద్రం నియమించిన ఆలయ ట్రస్ట్‌కు ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం ఉన్నప్పటికీ చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కే.సి. వేణుగోపాల్‌ ఆరోపించారు.

దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు సమర్పించిన విరాళాలను దారి మళ్లించారని వేణుగోపాల్‌ ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీని కావాలనే తొలగించారని, భద్రతా సిబ్బంది చేసిన హెచ్చరికలను కూడా పట్టించుకోలేదని అన్నారు. నిజాయతీగా వ్యవహరిస్తే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మౌనం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు.

జులై 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ అంశాన్ని కాంగ్రెస్‌ బలంగా లేవనెత్తనున్నట్లు వేణుగోపాల్‌ తెలిపారు. ప్రధాని మోదీ స్వయంగా దీనిపై ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. భక్తుల విశ్వాసాన్ని రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం బీజేపీ వినియోగిస్తోందని ఆరోపించారు. బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయాల నిర్వహణపైనా ఇలాంటి ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
Advertisement
Congress
Ayodhya Ram Temple donations
KC Venugopal
Supreme Court probe
Ram Mandir fund misuse
BJP government

More Telugu News