హీరోను చేస్తానని మోసం: ప్రముఖ తెలుగు దర్శకుడిపై కేసు నమోదు

Hero launch fraud case registered against prominent Telugu director
  • దర్శకుడు జి. అశోక్ బాబుపై రూ.3.5 కోట్ల చీటింగ్ కేసు
  • బాధితుడి కొడుకును హీరోగా పరిచయం చేస్తానని డబ్బులు వసూలు
  • దర్శకుడితో పాటు ఆయన భార్యను విచారించిన సైబరాబాద్ పోలీసులు
ప్రముఖ తెలుగు చిత్ర దర్శకుడు అశోక్ బాబు మోసం కేసులో చిక్కుకున్నారు. తమ కుమారుడిని హీరోగా పరిచయం చేస్తానని నమ్మబలికి సుమారు రూ. 3.5 కోట్లు వసూలు చేసి వంచించారంటూ ఒక కుటుంబం ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) అధికారులు కేసు నమోదు చేశారు.

హనుమంతరావు అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ప్రకారం, 2024 నుంచి 2026 జనవరి మధ్య కాలంలో దర్శకుడు అశోక్ పలు విడతలుగా ఈ మొత్తాన్ని స్వీకరించారు. తన కుమారుడిని హీరోగా వెండితెరకు పరిచయం చేయడమే కాకుండా, ప్రాజెక్టులో భాగస్వామ్యం కూడా కల్పిస్తానని ఆయన నమ్మబలికారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, సినిమా పట్టాలెక్కకపోవడంతో పాటు, తీసుకున్న డబ్బులు కూడా తిరిగి చెల్లించలేదని ఆయన ఆరోపించారు.

ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు, శుక్రవారం దర్శకుడు అశోక్‌తో పాటు ఆయన భార్య విజయను, ఇతర ఆర్థిక లావాదేవీలతో సంబంధం ఉన్న వారిని విచారణకు పిలిపించారు. ప్రస్తుతం పోలీసులు నగదు బదిలీకి సంబంధించిన 'మనీ ట్రయల్‌'పై దృష్టి సారించి దర్యాప్తును వేగవంతం చేశారు.

'పిల్ల జమీందార్', 'భాగమతి' వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన అశోక్, 'ఉషోదయం' చిత్రానికి గానూ ఉత్తమ బాలల చిత్ర దర్శకుడిగా నంది అవార్డును కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉందని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు వెల్లడించారు.
Advertisement
Ashok Babu
Tollywood Director Cheating Case
Cyberabad Economic Offences Wing
Pilla Zamindar Director Fraud

More Telugu News