ఏపీకి కొరియా పెట్టుబడులే లక్ష్యం.. బుసాన్‌లో మంత్రి లోకేశ్‌ కీలక భేటీలు

Nara Lokesh targets South Korean investments for AP with key meetings in Busan
  • దక్షిణ కొరియాలోని బుసాన్‌లో 'అపెక్స్-కొరియా' సహాయ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి 
  • కొరియా సంస్థలకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఇది అనుసంధానకర్తగా పనిచేస్తుంది  
  • భారీ ఆర్థిక సేవల సంస్థ బీఎన్‌కే ఫైనాన్షియల్ గ్రూప్‌తో లోకేశ్‌ కీలక సమావేశం
  • అమరావతిలో తమ బ్రాంచ్‌ను ఏర్పాటు చేయాలని బీఎన్‌కే గ్రూప్‌ను కోరిన మంత్రి
  • ఏపీలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నేడు బుసాన్ నగరంలో కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వానికి, కొరియా కంపెనీలకు మధ్య వారధిగా నిలిచేందుకు ఏపీఈడీబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'అపెక్స్-కొరియా' సహాయ కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై అక్కడి ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ బీఎన్‌కే ఫైనాన్షియల్ గ్రూప్‌ ఉన్నతస్థాయి బృందంతో సమావేశమయ్యారు.

అమరావతిలో బ్రాంచ్ పెట్టండి: బీఎన్‌కేకు లోకేశ్‌ పిలుపు
బుసాన్‌లో బీఎన్‌కే ఫైనాన్షియల్ గ్రూప్ ఎండీ లీ క్వాంగ్ జున్, బీఎన్‌కే క్యాపిటల్ సీఈవో సన్ డే జిన్‌తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు గల అపార అవకాశాలను వివరించారు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న అమరావతిలో బీఎన్‌కే ఫైనాన్షియల్ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే, రాష్ట్రంలోని స్టార్టప్‌లు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అండగా నిలిచేందుకు బీఎన్‌కే వెంచర్ క్యాపిటల్ సంస్థ.. ఏపీలోని ఆర్టీఐహెచ్‌లో భాగస్వామి కావాలని ఆహ్వానించారు. అమరావతి, పారిశ్రామిక పార్కులు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ అందించే అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, నౌకా నిర్మాణం వంటి రంగాల్లోని తమ క్లయింట్‌లను ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు.

మంత్రి లోకేశ్‌ ప్రతిపాదనలపై బీఎన్‌కే ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. తమ గ్రూప్‌లో మూడు బ్యాంకులు, సెక్యూరిటీస్, క్యాపిటల్, అసెట్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాలు ఉన్నాయని, తమకు కొరియాలో 398, విదేశాల్లో 75 శాఖలు ఉన్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీఎన్‌కే ఫైనాన్షియల్ గ్రూప్ ఆస్తుల విలువ సుమారు 101.9 బిలియన్ డాల‌ర్లు (దాదాపు రూ. 9.64 లక్షల కోట్లు) ఉండటం గమనార్హం.

కొరియా సంస్థలకు 'అపెక్స్' అండ
అంతకుముందు మంత్రి లోకేశ్‌ బుసాన్‌లో 'అపెక్స్-కొరియా' (ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌టర్నల్ ఎంగేజ్‌మెంట్-కొరియా) పేరుతో ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే కొరియా సంస్థలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తుందని లోకేశ్‌ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న కొరియా కంపెనీలకు కూడా ఈ కేంద్రం అవసరమైన సేవలు అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ఏపీఈడీబీ సీఈవో సగిలి షన్మోహన్, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య, పరిశ్రమలశాఖ కమిషనర్ శుభం బన్సాల్ పాల్గొన్నారు.

Advertisement
Nara Lokesh
Andhra Pradesh Investments
South Korea Visit
BNK Financial Group
APEX Korea Busan
Amaravati Development

More Telugu News