విజయవాడలో ఎన్‌ఐఏ మెగా దాడులు: ఐసిస్, అల్ ఖైదా టెర్రర్ నెట్‌వర్క్ గుట్టురట్టు!

NIA mega raids in Vijayawada ISIS and Al-Qaeda terror network busted
  • వించిపేట పరిసర ప్రాంతాల్లో ఎన్‌ఐఏ విస్తృత సోదాలు
  • విదేశీ హ్యాండ్లర్ అల్-హకీమ్ షుకూర్ ఆదేశాలతో ఐసిస్, అల్ ఖైదా నెట్‌వర్క్ విస్తరణ
  • భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చడమే లక్ష్యంగా ‘అల్-మాలిక్ ఇస్లామిక్ యూత్’ ఏర్పాటు
  • ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా యువతకు ఉగ్రవాద శిక్షణ, ఆత్మాహుతి దాడులకు ప్రేరేపణ
  • హైదరాబాద్‌కు చెందిన సయీదా బేగంతో ప్రత్యేక మహిళా వింగ్ ఏర్పాటుకు కుట్ర
ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్రవాద ముఠా లింకుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం ఉదయం నుండి ముమ్మర సోదాలు నిర్వహిస్తోంది. విజయవాడలోని వించిపేట ప్రాంతంలో నిందితుల ఇళ్లు, వారు నివసించిన స్థావరాలపై ఎన్‌ఐఏ అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఇటీవల విజయవాడ టు టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎన్‌ఐఏకు బదిలీ అయిన ఈ కేసు విచారణలో భాగంగా, నిందితులకు ఇతర వ్యక్తులు లేదా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధాలను వెలికితీసేందుకు ఈ తనిఖీలు జరుగుతున్నాయి.

అంతకుముందు, ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిఘా ఉంచి ఈ ముఠా కార్యకలాపాలను కనిపెట్టి, నెట్‌వర్క్‌ను ఛేదించింది. ఈ కేసులో ఇప్పటివరకు విజయవాడకు చెందిన మహ్మద్ రహ్మతుల్లా షరీఫ్ (23), ఎండీ డానిష్ (27), మీర్జా సోహైల్ బేగ్ (23)లతో పాటు హైదరాబాద్‌కు చెందిన సయీదా బేగం (38), కర్ణాటక బళ్లారికి చెందిన అబ్దుల్ సలాంలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి పలు రాష్ట్రాలకు చెందిన మొత్తం 12 మంది నిందితుల పేర్లు ఉన్నాయి. వీరంతా 'అల్-మాలిక్ ఇస్లామిక్ యూత్' అనే గ్రూపుగా ఏర్పడి, విదేశీ హ్యాండ్లర్ అల్-హకీమ్ షుకూర్ నిర్దేశకత్వంలో ఐసిస్, అల్-ఖైదా నెట్‌వర్క్‌ను భారత్‌లో విస్తరించడానికి పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

దిగ్భ్రాంతికరమైన కుట్ర కోణాలు
ఎన్‌ఐఏ అధికారుల విచారణలో నిందితులు తమ దేశద్రోహ ప్రణాళికలను అంగీకరించారు. భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చడం, భారత జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను ఎగురవేయడం, ‘గజ్వా-ఎ-హింద్’ కోసం పనిచేయడమే తమ ముఖ్య లక్ష్యాలని వారు వెల్లడించారు. ఇందుకోసం ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వేదికగా 'BENX COM' అనే రహస్య గ్రూపులను క్రియేట్ చేశారు. ఇందులో కొంతమంది పాకిస్ధానీయులు కూడా సభ్యులుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ గ్రూపుల ద్వారా జిహాద్ కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్న యువతను చేర్చుకుని, వారిని ఆత్మాహుతి దాడులకు ప్రేరేపించేవారు.

షుకూర్ ఆదేశాల మేరకు యువతను ఆకర్షించి, వారిని పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లలో స్నైపర్ రైఫిళ్లు, గన్స్, బ్లాక్ పౌడర్ బాంబులు, ఐఈడీల తయారీలో శిక్షణ ఇప్పించడానికి ప్లాన్ చేశారు. వీరికి కావాల్సిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను పాకిస్థాన్ సభ్యుల ద్వారా సరఫరా చేస్తామని షుకూర్ హామీ ఇచ్చినట్లు నిందితులు ఒప్పుకున్నారు. అంతేకాకుండా, హైదరాబాద్‌కు చెందిన సయీదా బేగం నాయకత్వంలో ప్రత్యేకంగా ఒక మహిళా వింగ్‌ను ఏర్పాటు చేసి భారత్‌లో తీవ్రవాదాన్ని వ్యాప్తి చేయాలని కుట్ర పన్నారు. ప్రస్తుతం నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), బీఎన్ఎస్, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి ఎన్‌ఐఏ లోతుగా దర్యాప్తు చేస్తోంది.
Advertisement
NIA
Vijayawada terror raids
ISIS Al Qaeda network
National Investigation Agency Andhra Pradesh
Al Malik Islamic Youth
Terrorist recruitment India

More Telugu News