ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు... స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
- ముంబైకి భారీ వర్ష సూచనతో రెడ్ అలర్ట్ జారీ
- నేటి మధ్యాహ్నం నుంచి స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన బీఎంసీ
- థానే, పాల్ఘర్, రాయగఢ్ జిల్లాల్లోనూ అతి భారీ వర్షాల అంచనా
- లోతట్టు ప్రాంతాలు జలమయం, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని బీఎంసీ విజ్ఞప్తి చేసింది. కాగా, ఈ వారం ప్రారంభం నుంచే ముంబై నగరాన్ని వానలు ముంచెత్తుతున్నాయి. గత 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో గరిష్టంగా 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ముంబైతో పాటు థానే, పాల్ఘర్, రాయగఢ్ జిల్లాల్లో జులై 4 నుంచి 6 వరకు ఈ రెడ్ అలర్ట్ అమల్లో ఉంటుందని ఐఎండీ స్పష్టం చేసింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తూ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే థానే జిల్లాతో పాటు కల్యాణ్-డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించారు.
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల ధాటికి ముంబైలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం కలిగింది. అంధేరి ఈస్ట్ సబ్వే వంటి ప్రాంతాల్లో చేరిన వర్షపు నీటిని తొలగించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన డీవాటరింగ్ పంపులను ఏర్పాటు చేసి చర్యలు చేపట్టారు.