మీడియాకు 'మిడిల్ ఫింగర్': అసలు విషయం చెప్పిన సియా గోయల్ తండ్రి!
- మీడియాకు అసభ్య సైగ చేయలేదన్న సియా గోయల్ తండ్రి
- కారు డోర్లో వేలు నలగడం వల్లే అలా జరిగిందని వివరణ
- వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో సియా ప్రధాన నిందితురాలు
కేసు దర్యాప్తులో భాగంగా గురువారం పుణే రూరల్ పోలీసులు సియా గోయల్ను మార్కెట్ యార్డ్లోని ఆమె నివాసానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో నల్లటి టీ-షర్ట్ ధరించి, ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్న సియా, విలేకరుల వైపు చూస్తూ తన చేతిని పైకి లేపారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడంతో, నిందితురాలి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో శనివారం ప్రవీణ్ గోయల్ ఒక వీడియోను విడుదల చేశారు. "సియా గోయల్ మధ్యవేలు చూపించిందని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. పోలీసులు ఆమెను ఇంటికి తీసుకువచ్చిన సమయంలో కారు డోర్లో రెండు వేళ్లు నలిగి గాయపడ్డాయి" అని ఆయన పేర్కొన్నారు. వాపుతో నీలంగా మారి, కట్టు కట్టి ఉన్న ఆమె వేలిని వీడియోలో చూపిస్తూ, ఈ విషయంపై అక్కడున్న పోలీసు అధికారులను అడిగి వాస్తవాలు తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.
ఈ కేసుకు సంబంధించి 20 ఏళ్ల సియా గోయల్తో పాటు 22 ఏళ్ల చేతన్ చౌదరిపై హత్య, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. జూన్ 18న పుణే సమీపంలోని లోహగడ్ కోట సందర్శనకు వెళ్లిన సమయంలో, సియా తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను లోయలోకి తోసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. తొలుత దీనిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ, విచారణలో సియా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి నిజాన్ని వెలికితీశారు.