ఢిల్లీ అల్లర్ల కేసు: ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ బెయిల్పై తీర్పు రిజర్వ్
- ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ల బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
- దాదాపు ఆరేళ్లుగా విచారణ లేకుండా జైల్లోనే ఉన్నామని పిటిషనర్ల వాదన
- సుదీర్ఘ జైలు జీవితం ప్రాథమిక హక్కులకు విరుద్ధమని కోర్టు దృష్టికి తెచ్చిన నిందితులు
- యూఏపీఏ కింద బెయిల్ నిబంధనలపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రస్తావించిన న్యాయవాదులు
- శనివారం సాయంత్రంలోగా తీర్పు వెలువరించే అవకాశం
విచారణ ప్రారంభం కాకుండానే తాము సుదీర్ఘ కాలంగా జైలులో ఉన్నామని, ఇది రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ తమ పిటిషన్లలో పేర్కొన్నారు. మారిన పరిస్థితుల్లో దృష్ట్యా, విచారణలో జాప్యం జరిగితే కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కూడా బెయిల్ మంజూరు చేయవచ్చని సుప్రీంకోర్టు ఇటీవల పలు కేసుల్లో స్పష్టం చేసిన విషయాన్ని వారు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన ఉత్తర్వులను వారు ఉదహరించారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల క్రమంలో 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో 53 మంది ప్రాణాలు కోల్పోగా, 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ హింస వెనుక ప్రధాన కుట్రదారులుగా ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లపై ఢిల్లీ పోలీసులు యూఏపీఏ, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.