టెలిగ్రామ్కు కేంద్రం సీరియస్ వార్నింగ్.. 15 రోజుల్లో నివేదికకు ఆదేశం!
- పైరసీ కంటెంట్పై టెలిగ్రామ్కు కేంద్ర సమాచార శాఖ హెచ్చరిక
- 15 రోజుల్లోగా చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని ఆదేశం
- భారత క్రియేటర్ ఎకానమీ, సినీ పరిశ్రమ పరిరక్షణే లక్ష్యం
- ఇటీవల నీట్ పరీక్ష మోసాల నేపథ్యంలోనూ టెలిగ్రామ్పై నిషేధం
- వాట్సాప్ యూజర్నేమ్ ఫీచర్పైనా దృష్టి సారించిన కేంద్రం
భారత్లో వేగంగా విస్తరిస్తున్న క్రియేటర్ ఎకానమీ, చిత్ర పరిశ్రమ, బ్రాడ్కాస్టర్లు, ఓటీటీ ప్లాట్ఫామ్లు, నిర్మాతలు, పంపిణీదారులను డిజిటల్ పైరసీ బారి నుంచి కాపాడే లక్ష్యంతో కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలైన కొద్ది గంటల్లోనే టెలిగ్రామ్ ఛానెళ్ల ద్వారా పైరసీకి గురవుతుండటంతో పరిశ్రమ వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రంగంలోకి దిగింది.
ఇటీవల నీట్-యూజీ 2026 పునఃపరీక్ష సందర్భంగా మోసాలను అరికట్టేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ జూన్ 22 వరకు టెలిగ్రామ్ను తాత్కాలికంగా బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. పరీక్షలో అక్రమాలకు పాల్పడేందుకు కొన్ని ముఠాలు ఈ యాప్ను వ్యవస్థీకృతంగా వాడుతున్నాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా చుక్కెదురైంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం చట్టప్రకారమే తన అధికారాలను ఉపయోగించిందని, ఈ ఆంక్షలు సమంజసమేనని జస్టిస్ తేజస్ కరియా ధర్మాసనం తీర్పునిచ్చింది.
ఒకవైపు టెలిగ్రామ్కు పైరసీపై ఆదేశాలు జారీ చేసిన కేంద్రం, మరోవైపు మెటా యాజమాన్యంలోని వాట్సాప్పైనా దృష్టి సారించింది. వాట్సాప్ తీసుకురావాలనుకుంటున్న 'యూజర్నేమ్' ఫీచర్పై సంప్రదింపులు పూర్తయ్యే వరకు దానిని భారత్లో ప్రారంభించవద్దని మెటాను ఆదేశించింది. దీనిపై స్పందించిన వాట్సాప్, ఈ ఫీచర్ ఐచ్ఛికమని, మోసాలు, నకిలీ ఖాతాలను నివారించేందుకు తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది.