ఆదర్శ గ్రామంగా నలగంపల్లె.. కుప్పం అంతటా 'నెట్ జీరో' మోడల్: సీఎం చంద్ర‌బాబు

Chandrababu Naidu praises Nalagampalle as ideal village and plans Kuppam Net Zero expansion
  • కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన
  • 'నెట్ జీరో' విధానాన్ని పాటిస్తున్న నలగంపల్లె గ్రామంలో పర్యటన
  • సౌర విద్యుత్ వినియోగంతో నెలకు రూ.400 ఆదా చేసుకుంటున్న గ్రామస్థులు
  • ఈ విధానాన్ని కుప్పం అంతటా అమలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
  • సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించాలని, ఈవీలను చేర్చాలని సూచన
సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండో రోజు పర్యటన కొనసాగించారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన నలగంపల్లె గ్రామాన్ని సందర్శించి, అక్కడి ప్రజలు అవలంబిస్తున్న వినూత్న 'నెట్ జీరో' విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. సౌర విద్యుత్ వినియోగం, వ్యర్థాల నిర్వహణ, నీటి పొదుపు వంటి పద్ధతులతో ఆదర్శంగా నిలుస్తున్న ఈ గ్రామంపై ఆయన ప్రశంసలు కురిపించారు.

శనివారం ఉదయం నలగంపల్లె గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రి, స్థానిక ప్రజలతో కలిసిపోయారు. ఓ గ్రామస్థుని ఇంటికి స్వయంగా వెళ్లి, వారు ఏర్పాటు చేసుకున్న రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను పరిశీలించారు. "ఎన్ని ప్యానెళ్లు పెట్టారు? ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఇంటి అవసరాలకు సరిపోతుందా?" అని ఆరా తీశారు. సౌర విద్యుత్‌తోనే ఇండక్షన్ స్టవ్‌లను వినియోగిస్తూ వంట చేసుకుంటున్నామని, దీనివల్ల గ్యాస్ సిలిండర్ ఖర్చుతో పాటు నెలకు సుమారు రూ.400 వరకు ఆదా చేసుకోగలుగుతున్నామని గ్రామస్థులు ముఖ్యమంత్రికి వివరించారు. గ్యాస్ లీకేజీ వంటి ప్రమాదాల భయం కూడా తప్పిందని వారు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నలగంపల్లె గ్రామస్థులు అనుసరిస్తున్న వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ, కిచెన్ కంపోస్ట్ ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ, టెర్రస్ గార్డెనింగ్ వంటి విధానాలను చంద్రబాబు అభినందించారు. నలగంపల్లె గ్రామంలో అనుసరిస్తున్న ఈ విధానాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుంటామని ప్రకటించారు. ఈ 'నెట్ జీరో' విధానాన్ని కుప్పం నియోజకవర్గం వ్యాప్తంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, ఈ విధానంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని కూడా చేర్చాలని, 'సర్క్యులర్ ఎకానమీ'ని ప్రోత్సహించాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పటికే ఇండక్షన్ స్టవ్‌లను వినియోగిస్తున్నామని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోందని, ఈ నెట్ జీరో విధానం వారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. కుప్పం నియోజకవర్గంలో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ ద్వారా 7,489 మంది ఎస్సీ, ఎస్టీలు, 39,215 మంది బీసీలు, 7,381 మంది ఓసీలకు లబ్ధి చేకూరేలా తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు.

Chandrababu Naidu
Kuppam
Net Zero Village
Solar Rooftop Scheme
Nalagampalle
Andhra Pradesh CM

More Telugu News