నన్నే పట్టిస్తావా? బట్టలిప్పి నీపై కేసు పెడతా.. యజమానిని బెదిరించిన మహిళా దొంగ
- జైపూర్లో దొంగతనం కోసం ఇంట్లోకి చొరబడ్డ మహిళ
- సీసీటీవీలో గమనించి బయటి నుంచి తాళం వేసిన యజమాని
- తప్పించుకోలేక యజమానినే బెదిరించిన దొంగ
- బట్టలు విప్పి కేసు పెడతానంటూ బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం
- మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు
- సోషల్ మీడియాలో ఘటన వీడియో వైరల్
వివరాల్లోకి వెళ్తే.. ముహానా ప్రాంతంలోని ఓ ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయం చూసి సదరు మహిళ లోపలికి ప్రవేశించింది. గతంలోనే తన ఇంట్లో చోరీ జరగడంతో యజమాని భద్రత కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాడు. బయట ఉన్న యజమాని తన మొబైల్లో ఫుటేజీని గమనించగా, బెడ్రూమ్లో ఓ మహిళ నగలు, ఇతర విలువైన వస్తువుల కోసం వెతుకుతున్నట్లు కనిపించింది.
దీంతో అప్రమత్తమైన యజమాని, వెంటనే పొరుగువారికి ఫోన్ చేసి ఇంటి ప్రధాన ద్వారానికి బయటి నుంచి తాళం వేయాలని కోరాడు. కొద్దిసేపటికే ఆయన ఇంటికి చేరుకోగా, బయటకు వెళ్లే మార్గం లేక ఆ మహిళ లోపలే చిక్కుకుపోయింది. యజమానిని చూసిన ఆమె ఒక్కసారిగా ఎదురుదాడికి దిగింది. "నన్ను ఇక్కడి నుంచి పంపించకపోతే బట్టలు విప్పేసి, పోలీసులకు ఫోన్ చేసి నీపై తప్పుడు కేసు పెడతాను" అంటూ బెదిరించింది.
యజమాని ఆమె బెదిరింపులను తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు.