కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పనులను నేడు ప్రారంభించనున్న చంద్రబాబు
- జమ్మలమడుగు నియోకవర్గంలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్
- 1,100 ఎకరాల్లో రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో ప్లాంట్ నిర్మాణం
- ప్రత్యక్షంగా 2,700 మందికి ఉపాధి అవకాశాలు
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రగతికి సరికొత్త అడుగు పడింది. సున్నపురాళ్లపల్లి గ్రామంలో 'జేఎస్డబ్ల్యూ' స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అధికారికంగా ప్రారంభించనున్నారు. అందుకోసం ఆయన తిరుపతి పర్యటన ముగించుకుని నేరుగా సున్నపురాళ్లపల్లి హెలిప్యాడ్కు చేరుకుంటారు. స్టీల్ ప్లాంట్ పనులకు భూమిపూజ చేసిన అనంతరం, అదే ప్రాంగణంలో జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ ప్లాంట్కు కూడా శంకుస్థాపన చేయనున్నారు.
ఈ రెండు భారీ ప్రాజెక్టుల ద్వారా జిల్లా రూపురేఖలు మారనున్నాయి. మొత్తం 1,100 ఎకరాల విస్తీర్ణంలో రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో రెండు దశల్లో ఈ స్టీల్ ప్లాంట్ను జేఎస్డబ్ల్యూ సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఇందులో తొలి దశ కింద రూ.4,500 కోట్లు, మలి దశలో రూ.11,850 కోట్లను సంస్థ కేటాయించింది. దీనితో పాటు, పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తి కోసం రూ.20,350 కోట్ల పెట్టుబడితో 3,850 మెగావాట్ల సామర్థ్యం గల గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ను కూడా నిర్మిస్తున్నారు. సోలార్, విండ్ (పవన) శక్తి ద్వారా ఈ విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ స్టీల్ ప్లాంట్, ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా స్థానిక ప్రాంతానికి చెందిన దాదాపు 2,700 మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.