'తల్లికి వందనం' రెండో విడత తేదీలు ఖరారు.. మంత్రి నారా లోకేష్

Nara Lokesh finalizes Thalliki Vandanam second phase dates
  • జూలై 16 నుంచి 18 మధ్య తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్న మంత్రి లోకేశ్
  • 150 రోజుల్లో 16,000 టీచర్, 6,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేశామని వెల్లడి
  • ఈ ఏడాది మరో 10,000 పోస్టులతో మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న లోకేశ్
  • ప్రభుత్వ విజయాలపై జూలై 15 నుంచి ఇంటింటి ప్రచారం చేయాలని పిలుపు
'తల్లికి వందనం' పథకం రెండో విడత నిధులను జూలై 16 నుంచి 18వ తేదీల మధ్య తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లు (పీటీఎం) నిర్వహించే సమయంలోనే ఈ నిధులను విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

రేణిగుంట మండలంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో లోకేష్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 150 రోజుల వ్యవధిలోనే 16,000 ఉపాధ్యాయ, 6,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ ఏడాది మరో 10,000 పోస్టులతో మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు వివరించారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జూలై 15 నుంచి 'ఇంటింటి ప్రచారం' చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా, ప్రతిపక్ష పార్టీల వైఖరిని ప్రస్తావిస్తూ.. కార్యకర్తలు చెడు లక్షణాలను అలవర్చుకోవద్దని సూచించారు.

ఈ పర్యటనలో భాగంగా లోకేష్ పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి తనిఖీ చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించడంతో పాటు, పలువురు లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.                                
Nara Lokesh
Thalliki Vandanam
Andhra Pradesh Education Minister
Thalliki Vandanam Second Phase
Mega Job Calendar AP
AP Mega Parent Teacher Meetings

More Telugu News