అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో సంచలనం: నిందితుడి ఇల్లే టార్గెట్.. కూల్చివేతకు ఏడీఏ సన్నాహాలు!

Ayodhya Ram Mandir donation theft case sensation accused house targeted for demolition
  • అయోధ్య అథారిటీ నుండి కూల్చివేత నోటీసులు
  • నిందితుడు లవకుష్ మిశ్రా భార్య పేరిట ఆస్తి
  • నిబంధనల ఉల్లంఘనపై వివరణకు వారం గడువు
  • ట్రస్ట్‌లో పనిచేస్తున్న కాలంలోనే భూమి కొనుగోలు
  • విరాళాల దారిమళ్లింపు కేసు దర్యాప్తు ముమ్మరం
అయోధ్య రామ మందిరం విరాళాల దారిమళ్లింపు (నిధుల దుర్వినియోగం) కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుల్లో ఒకరైన లవకుష్ మిశ్రాకు సంబంధించిన ఆస్తిపై ఇప్పుడు బుల్డోజర్ నీడ పరుచుకుంది. అయోధ్యలోని సోహావల తహసీల్ పరిధిలోని మాంగ్సీ పరగణాలో నిర్మాణంలో ఉన్న అతని రెండంతస్తుల ఇంటిని కూల్చివేసేందుకు అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ (ఏడీఏ) ప్రాథమిక చర్యలు ప్రారంభించింది. 1,000 చదరపు అడుగుల స్థలంలో నిర్మిస్తున్న ఈ ఇల్లు లవకుష్ మిశ్రా భార్య సుప్రియ మిశ్రా పేరిట నమోదై ఉంది.

భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి, ఎలాంటి ముందస్తు అనుమతులు లేదా ఆమోదించిన మ్యాప్ లేకుండానే ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు ఏడీఏ అధికారులు తమ తనిఖీల్లో గుర్తించారు. ఈ మేరకు నిందితుడి కుటుంబానికి నోటీసులు జారీ చేసిన అధికారులు.. అవసరమైన పత్రాలను సమర్పించి వివరణ ఇవ్వడానికి వారం రోజుల గడువు విధించారు. నిర్ణీత గడువులోగా సరైన ఆధారాలు చూపించకపోతే చట్టప్రకారం కూల్చివేత ప్రక్రియ చేపడతామని అధికారులు హెచ్చరించారు.

రాముడి సొమ్ముతోనే కొనుగోళ్లు? 
27 ఏళ్ల లవకుష్ మిశ్రా గతంలో రామాలయ ట్రస్ట్ ఆఫీసులో విరాళాల లెక్కింపు విభాగంలో నెలకు కేవలం రూ. 12,000 నుండి రూ. 15,000 జీతానికి పనిచేసేవాడు. అయితే, అతను ట్రస్ట్‌లో పనిచేస్తున్న కాలంలోనే అంటే అక్టోబర్ 2025లో ఈ భూమిని రూ. 8.8 లక్షలకు కొనుగోలు చేసినట్లు పత్రాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఈ ఆస్తి విలువ దాదాపు రూ. 25 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఫిబ్రవరి 2026 నుండి ఇక్కడ భవన నిర్మాణం శరవేగంగా ప్రారంభమైంది. రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాలను దొంగిలించి, ఆ సొమ్ముతోనే ఈ ఆస్తులు కొనుగోలు చేశాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు లవకుష్ మిశ్రాను అరెస్ట్ చేసి, అతడి నుండి పెద్ద మొత్తంలో నగదును రికవరీ చేశారు. తాజాగా అతని నివాసంలో సోదాలు నిర్వహించి, తండ్రిని కూడా విచారించిన పోలీసులు.. ఆస్తి కొనుగోలు వివరాలపై దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
Lavkush Mishra
Ayodhya Ram Mandir
Ram Mandir donation theft case
Ayodhya Development Authority
Bulldozer action Ayodhya
Ram Janmabhoomi Trust fund scam

More Telugu News