పాకిస్థాన్లో 125 ఏళ్ల నాటి గురుద్వారా ధ్వంసం.. తీవ్రంగా స్పందించిన భారత్
- దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ
- దోషులపై చర్యలు తీసుకుని, కట్టడాన్ని పునరుద్ధరించాలని డిమాండ్
- మైనారిటీల ప్రార్థనా స్థలాల రక్షణలో పాక్ విఫలమైందని విమర్శలు
ఫరూఖాబాద్ (మండి చుర్కానా) ప్రాంతంలోని చారిత్రక గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ సాహిబ్పై జూన్ 24 రాత్రి గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గురుద్వారా గుమ్మటం సహా కట్టడంలోని కొన్ని భాగాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిని నివారించడంలో స్థానిక అధికారులు విఫలమయ్యారని పాకిస్థాన్లోని సిక్కు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఈ దుశ్చర్యపై ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ సహా పలు సిక్కు సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పాకిస్థాన్లో మైనారిటీల ప్రార్థనా స్థలాలపై తరచూ దాడులు జరుగుతున్నాయని, వాటికి తగిన రక్షణ కల్పించాలని కోరాయి.
మైనారిటీల పవిత్ర స్థలాలను పరిరక్షించాల్సిన బాధ్యతను పాకిస్థాన్ విస్మరించకూడదని భారత్ హితవు పలికింది. ధ్వంసమైన గురుద్వారా భాగాలను తక్షణమే పునరుద్ధరించాలని, మైనారిటీ వర్గాలకు, వారి ప్రార్థనా స్థలాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని స్పష్టం చేసింది.