ఏపీ మీదుగా బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే... టోల్ ఫీజు రూ.195!

Bangalore Chennai Expressway via AP Toll Fee 195 Rupees
  • ఏపీలో అందుబాటులోకి వచ్చిన బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే
  • బేతమంగళ-బైరెడ్డిపల్లె మధ్య 25 కిలోమీటర్ల మార్గం ప్రారంభం
  • హోస్కోటె నుంచి బైరెడ్డిపల్లె వరకు కారుకు టోల్ ఫీజు రూ.195
  • పూర్తయితే 3 గంటల్లోనే బెంగళూరు నుంచి చెన్నైకి ప్రయాణం
  • 2026 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యం
బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశలో భాగంగా బేతమంగళ నుంచి బైరెడ్డిపల్లె వరకు 25 కిలోమీటర్ల మేర కొత్త మార్గాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) రాకపోకలకు అందుబాటులోకి తెచ్చింది. జూన్ 25 నుంచి ఈ మార్గంలో వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణ దూరం దాదాపు 100 కిలోమీటర్లకు చేరింది.

ఇప్పటికే కర్ణాటకలోని హోస్కోటె నుంచి బేతమంగళ వరకు 71 కిలోమీటర్ల మార్గం వినియోగంలో ఉండగా, తాజా విస్తరణతో బైరెడ్డిపల్లె వరకు నిరంతరాయంగా ప్రయాణించే వీలు కలిగింది. ఎన్ హెచ్ఏఐ విడుదల చేసిన టోల్ నోటిఫికేషన్ ప్రకారం, హోస్కోటె నుంచి బైరెడ్డిపల్లె వరకు ప్రయాణించే కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒకవైపు ప్రయాణానికి టోల్ ఛార్జీగా రూ.195 నిర్ణయించారు.

మొత్తం 262 కిలోమీటర్ల పొడవైన ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే బెంగళూరు-చెన్నై మధ్య ప్రయాణ సమయం ప్రస్తుతం ఉన్న ఆరు గంటల నుంచి కేవలం మూడు గంటలకు తగ్గనుంది. ఈ ప్రాజెక్టు కర్ణాటక (72 కి.మీ.), ఆంధ్రప్రదేశ్ (85 కి.మీ.), తమిళనాడు (106 కి.మీ.) రాష్ట్రాల గుండా వెళ్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో 85 కిలోమీటర్ల పనులను మూడు ప్యాకేజీలుగా విభజించగా, వాటిలో రెండు దాదాపు పూర్తయినట్టు  ఎన్ హెచ్ఏఐ అధికారులు తెలిపారు. 

అటవీ అనుమతుల కారణంగా పెండింగ్‌లో ఉన్న పనులను కూడా వేగవంతం చేస్తున్నారు. కొత్తగా ప్రారంభమైన బైరెడ్డిపల్లె టోల్ ప్లాజా వద్ద అప్పుడే రోజుకు సగటున రూ.2.2 లక్షల ఆదాయం వస్తోంది. మొత్తం ప్రాజెక్టును 2026 డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Bangalore Chennai Expressway
NHAI
Andhra Pradesh
Toll Fee
Baireddypalle
Greenfield Expressway

More Telugu News