ప్రిన్సిపాల్పై దాడి.. నిజామాబాద్ బీజేపీ నేత బాలు అరెస్ట్
- దాడి ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు
- నమాజ్ నేర్పుతున్నారని బీజేపీ ఆరోపణ.. స్కూల్ యాజమాన్యం ఖండన
- బీజేపీ నేతపై కేసు.. స్కూల్ ప్రిన్సిపాల్, కరస్పాండెంట్పై కౌంటర్ కేసు నమోదు
- ఉర్దూ గొప్ప సంస్కృతి అని, దాన్ని ఆపలేరని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్య
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డికి చెందినదిగా చెబుతున్న అంకాపూర్లోని ఒక గెస్ట్ హౌస్లో ఉన్న బాలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బాలు, అతని మద్దతుదారులు పోలీసులను ప్రతిఘటించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బాలును బలవంతంగా వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లారు.
వివరాల్లోకి వెళితే, జూన్ 27న ఆర్మూర్లోని భారత్ చంద్ర స్కూల్ ప్రిన్సిపాల్ అమెర్ ఖాన్పై మండుల బాలు, అతని మద్దతుదారులు దాడి చేశారు. స్కూల్లో ఉర్దూ బోధించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక పోలీస్ అధికారి సమక్షంలోనే బాలు ప్రిన్సిపాల్ను చెంపపై కొట్టడం, దుర్భాషలాడటం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసుల తీరుపై, బీజేపీ నేత తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఉర్దూతో పాటు విద్యార్థులకు నమాజ్ వంటి మతపరమైన పద్ధతులు నేర్పుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను స్కూల్ యాజమాన్యం ఖండించింది. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఉర్దూను రెండో భాషగా ప్రవేశపెట్టాలని యాజమాన్యం నిర్ణయించిందని స్కూల్ కరస్పాండెంట్ మల్లయ్య వివరించారు.
ఈ ఘటనపై స్కూల్ కరస్పాండెంట్ మల్లయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు బాలుపై స్కూల్లోకి నేరపూరిత చొరబాటు, దాడి, ఇతర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదే సమయంలో, ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ.. స్కూల్ ప్రిన్సిపాల్, కరస్పాండెంట్పై వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ కౌంటర్ కేసు నమోదు చేయడం గమనార్హం.
ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి స్పందిస్తూ, ఉర్దూ ఒక గొప్ప భాష అని, తెలంగాణ చరిత్ర, సంస్కృతిలో భాగమని అన్నారు. దాన్ని అడ్డుకునే హక్కు బీజేపీకి లేదని ఆమె వ్యాఖ్యానించారు.