'ఇడుపు కాయితం'పై రగడ.. తెలంగాణ భాషపై గరికపాటి పాత కామెంట్స్ వైరల్!
- ప్రియదర్శి 'ఇడుపు కాయితం' సినిమా టైటిల్పై సోషల్ మీడియాలో వివాదం
- ఆంధ్రా, తెలంగాణ నెటిజన్ల మధ్య భాషాపరమైన వాగ్వాదానికి దారితీసిన ట్రోల్స్
- తెలంగాణ భాష శాస్త్రీయమైందని, గ్రాంథికానికి దగ్గరగా ఉంటుందన్న గరికపాటి
వివాదం ఎలా మొదలైందంటే?
'ఇడుపు కాయితం' అనే టైటిల్ను ప్రకటించగానే, ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో దీనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "ఇదేం భాష? ఇది తెలుగేనా? ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేస్తారా?" అంటూ కొందరు, "సినిమాకు సబ్టైటిల్స్ తప్పనిసరి" అని మరికొందరు హేళన చేస్తూ పోస్టులు పెట్టారు. ఈ ట్రోల్స్తో తెలంగాణ భాషాభిమానులు, నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఇది తమ యాసను, సంస్కృతిని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కౌంటర్ కామెంట్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఈ వ్యవహారం 'ఆంధ్రా వర్సెస్ తెలంగాణ' భాషా వివాదంగా మారింది.
తెరపైకి గరికపాటి వీడియో
ఈ రగడ జరుగుతున్న తరుణంలో గరికపాటి నరసింహారావు గతంలో చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను తెలంగాణ నెటిజన్లు షేర్ చేస్తున్నారు. తెలంగాణ భాష గొప్పతనాన్ని, దాని శాస్త్రీయతను వివరిస్తూ గరికపాటి చేసిన వ్యాఖ్యలను ప్రత్యర్థులకు సమాధానంగా వాడుకుంటున్నారు.
ఆ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ.. "తెలంగాణ భాష, గ్రాంథిక భాషకు చాలా దగ్గరైన భాష. వ్యాకరణం తెలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఉదాహరణకు తెలంగాణలో 'చేసిన్రు' అంటారు. పద్యాల్లో మనం 'చేసినారు' అని వాడతాం. నిష్పక్షపాతంగా చెబుతున్నా, తెలంగాణ భాష శాస్త్రీయమైన భాష. దీనికి ప్రధాన కారణం, ఆ ప్రాంతంపై దిక్కుమాలిన ఆంగ్ల భాష ప్రభావం చాలా తక్కువగా ఉండటమే. ఆ ఆంగ్లేయులు సర్కార్ జిల్లాల్లో ప్రవేశించి అక్కడి భాషను, ఆచారాలను నాశనం చేశారు. అందుకే అక్కడ నోరు విప్పితే ఇంగ్లీష్ తప్ప తెలుగు రావడం లేదు" అని వ్యాఖ్యానించారు. ఈ వీడియోను షేర్ చేస్తూ, 'గరికపాటి గురువు గారు బరాబర్ చెప్పిన్రు' అంటూ తెలంగాణ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
'ఇడుపు కాయితం' అంటే ఏమిటి?
'ఇడుపు కాయితం' అనేది అచ్చమైన తెలంగాణ గ్రామీణ పదం అని భాషా నిపుణులు చెబుతున్నారు. గతంలో భార్యాభర్తలు విడిపోవాలనుకున్నప్పుడు, కోర్టుల చుట్టూ తిరగకుండా గ్రామ పెద్దల సమక్షంలో రాసుకునే ఒప్పంద పత్రాన్నే (విడాకుల పత్రం) 'ఇడుపు కాయితం' అని పిలిచేవారని వారు వివరిస్తున్నారు. ఒక సినిమా టైటిల్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న మాండలిక భేదాలు, సాంస్కృతిక వైవిధ్యం మరోసారి చర్చనీయాంశంగా మారాయి.