తిరుమలలో గర్భగుడి తలుపులు తెరిచాక... శ్రీవారి తొలి దర్శనం చేసుకునేది ఆయనే!
- తిరుమల శ్రీవారి తొలి దర్శన భాగ్యం ఓ సామాన్యుడిది
- 'సన్నిధి గొల్ల'గా పిలిచే యాదవ వంశీయుడికే ఈ గౌరవం
- గర్భగుడిలో తొలి దీపం వెలిగించాకే ప్రారంభమయ్యే సుప్రభాత సేవ
- స్వామివారే స్వయంగా ప్రసాదించిన వరంగా కొనసాగుతున్న సాంప్రదాయం
ప్రతిరోజూ తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో శ్రీవారి ఆలయ తలుపులు తెరుస్తారు. ఆలయ ప్రధాన అర్చకులు, పేష్కార్, జియ్యంగార్ స్వామి తమ దగ్గరున్న మూడు వేర్వేరు తాళాలతో గర్భగుడికి ముందుండే బంగారు వాకిలిని తెరుస్తారు. అయితే, వారెవరూ లోపలికి ప్రవేశించరు. వారి అనుమతితో మొదటగా 'సన్నిధి గొల్ల' గర్భగుడిలోకి అడుగుపెడతారు. చిమ్మ చీకటిలో ఉన్న స్వామివారి ముందు ఆయన దీపం వెలిగిస్తారు. ఆ తర్వాతే అర్చకులు లోపలికి వెళ్లి సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలుపుతారు.
ఈ సాంప్రదాయం వెనుక బలమైన కారణం ఉంది. కలియుగంలో శ్రీవారు తిరుమల కొండపై వెలసినప్పుడు, ఆయన్ను తొలుత గుర్తించి సేవలు చేసింది ఓ యాదవ భక్తుడని పురాణాలు చెబుతున్నాయి. అతని నిష్కల్మష భక్తికి మెచ్చిన స్వామివారు... ప్రతిరోజూ తన తొలి దర్శనం చేసుకునే హక్కును అతని వంశీయులకు వరంగా ప్రసాదించారు. ఆ వరం కారణంగానే నేటికీ ఈ ఆచారం కొనసాగుతోంది.
హోదా, అంతస్థులతో సంబంధం లేకుండా భక్తికే అగ్రపీఠం అని చాటిచెప్పే ఈ సాంప్రదాయం, తిరుమల క్షేత్రం యొక్క విశిష్టతను తెలియజేస్తుంది. సామాన్య భక్తుడికి లభించిన ఈ అపురూప గౌరవం, శ్రీవారికి భక్తుల పట్ల ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది.